టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది..అధికారికంగా పొత్తులపై ఎలాంటి ప్రకటన లేదు గాని..పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అనడం బట్టి చూస్తే టీడీపీతో కలవడం ఖాయమని తెలుస్తోంది. పైగా ఇటీవల టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా..తనకు సీటు విషయంలో ఇబ్బంది లేదు అని, బాబు ఏం చెబితే అది చేస్తానని, ఆయనే తన భవిష్యత్ చూసుకుంటారని మాట్లాడారు. అంటే ఆలపాటి ఉన్న తెనాలి స్థానం పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వనున్నారు. ఇక అక్కడ జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.
ఈ అంశాలని బట్టి చూస్తుంటే టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే అర్ధమవుతుంది. అదే సమయంలో చంద్రబాబు చాలా ముందు జాగ్రత్తగా కొన్ని స్థానాల్లో టీడీపీ ఇంచార్జ్ లుగా బలమైన నాయకులని పెట్టలేదు. అంటే ఆ సీట్లని జనసేనకు ఇచ్చిన టీడీపీ నేతల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ముందే ప్లాన్ చేసుకున్నారు. అంటే టీడీపీలో డమ్మీ ఇంచార్జ్లని పెట్టారు. అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు సీట్లు ఉన్నాయి.
భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం స్థానాల్లో టీడీపీ తరుపున డమ్మీ ఇంచార్జ్లు ఉన్నారు. భీమవరంలో తోట సీతారామలక్ష్మీ, తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ, నరసాపురంలో పాతూరి రామరాజు ఉన్నారు. ఈ ముగ్గురుకు పెద్ద బలం ఏమి లేదు. పైగా గత ఎన్నికల్లో భీమవరం, నరసాపురం స్థానాల్లో టీడీపీ మూడోస్థానంలో నిలవగా, జనసేన రెండోస్థానంలో నిలిచింది. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేనల ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి.
దీంతో ఈ మూడు స్థానాలని జనసేనకు కేటాయించాలనే చెప్పి..వాటిల్లో టీడీపీ తరుపున డమ్మీ ఇంచార్జ్లని పెట్టారని తెలుస్తోంది. ఇక రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే..ఈ మూడు సీట్లని ఈజీగా గెలుచుకోవచ్చు.