అధికారం ఉంటే ఎక్కువ హడావిడి చేయవచ్చు..ప్రత్యర్ధులని బూతులు తిట్టడం..అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణిచి వేయడం..ఇంకా అక్రమాలు చేయడం..ఇవే ఏపీలో చాలామంది వైసీపీ నేతలు చేసే పనులు అని టిడిపి శ్రేణులు మొదట నుంచి ఆరోపిస్తున్నాయి. అధికారంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వైసీపీ నేతలకు లేదని అంటుంటారు. ఇక సేమ్ అదే బాటలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా పయనించారని, అందుకే ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత ఓ రేంజ్ లో పెరిగిందని అంటున్నారు.
2014 ఎన్నికల్లో అనిల్..నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో అనిల్ ఓడిపోతారని అనుకున్నారు. ఎందుకంటే ఆయనపై పోటీ చేసింది నారాయణ. టిడిపి నుంచి నారాయణ బరిలో దిగారు. కానీ జగన్ వేవ్ లో అనిల్..కేవలం 2 వేల ఓట్ల తేడాతో గెలిచి బయటపడ్డారు. అలా గెలవడం వెంటనే మంత్రి పదవి కూడా వచ్చింది. దీంతో ఆయన ప్రజలకు సేవ చేయడం కంటే జగన్కు భజన చేయడం, చంద్రబాబుని తిట్టడం చేశారు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా..తన శాఖకు న్యాయం చేయలేదు. అలాగే నెల్లూరులో ఆయన అనుచరులు అక్రమాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సిటీలో అనిల్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ సారి ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసే టిడిపి నాయకుడు ఎవరు అనేది మొన్నటివరకు క్లారిటీ రాలేదు.
కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ నారాయణ పోటీ చేయడానికి రెడీ అయిపోయారని తెలిసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నారాయణపై కేసులు పెట్టి ఎలా ఇబ్బందులు పెడుతున్నారో తెలిసిందే. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే వదలలేదు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో బరిలో ఉండి ఖచ్చితంగా గెలిచి తీరాలని నారాయణ చూస్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా సిటీలో నారాయణని బరిలో దించి అనిల్కు చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి ఈ సారి అనిల్ కు భారీ దెబ్బ తగలడం ఖాయం.