Site icon Neti Telugu

పోలవరంలో తమ్ముళ్ళ పోరు..మళ్ళీ దెబ్బవేస్తారా?

తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతున్న స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పికి బలం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవనాడిగా ఉన్న పోలవరం ఇక్కడే ఉంది. అయితే జగన్ ప్రభుత్వం పోలవరంని గాలికొదిలేసిన విషయం తెలిసిందే. అలాగే ముంపు నిర్వాసితులని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నారు.

ఇలాంటి తరుణంలో మంచి అవకాశాన్ని టి‌డి‌పి నేతలు ఉపయోగించుకోకుండా..సీటు కోసం పోటీ పడుతున్నారు. దీని వల్ల గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. మామూలుగా పోలవరం నియోజకవర్గంపై టి‌డి‌పికి కాస్త పట్టు ఉంది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. అభ్యర్ధిని మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. 2014లో టి‌డి‌పి నుంచి మోడియం శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు. ఆయనపై వ్యతిరేకత రావడంతో 2019లో సీటు ఇవ్వలేదు.

దీంతో 2019లో టి‌డి‌పి సీటు బొరగం శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతానికి ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. అటు మోడియం కూడా తన పని తాను చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి పనులు చేయడంతో పోలవరంలో టి‌డి‌పిలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు సీటు ఎవరికి దక్కుతుందో తెలియడం లేదు.

ఇక సీటు ఒకరికి దక్కితే..మరొకరు సహకరించేలా లేరు. దీని వల్ల టి‌డి‌పికే నష్టం. ఓ వైపు వైసీపీపై వ్యతిరేకత ఉన్న దాన్ని ఉపయోగించుకోవడం లేదు. టి‌డి‌పిలో గ్రూపులు ఉండటం వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికైనా టి‌డి‌పి నేతలు కలిసి పనిచేస్తే పోలవరం దక్కుతుంది..లేదంటే మళ్ళీ కష్టమే.

Exit mobile version