తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ఒకటి. 2014 వరకు ఇక్కడ టిడిపి పరిస్తితి బాగానే ఉంది. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ఎప్పుడైతే వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిందో..అప్పటినుంచి చింతలపూడిలో టిడిపి హవా తగ్గుతూ వస్తుంది. పైగా గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు…ఆ తర్వాత అనారోగ్యంతో మరణించారు.

దీంతో అక్కడ టిడిపిని నడిపించే నాయకుడు లేరు. కానీ ఎవరికి వారు ఆ సీటుపై పెత్తనం చేస్తూ వస్తున్నారు. సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎవరికి సీటు ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంచార్జ్లు లేని స్థానాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే చింతలపూడి సీటులో అభ్యర్ధిని ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే చింతలపూడి సీటుపై మాజీ మంత్రి పీతల సుజాత ఆశలు పెట్టుకున్నారు..కానీ ఆమెకు సీటు దక్కడం డౌటే.

మాజీ జెడ్పీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెం టౌన్కు చెందిన పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు, మిషన్ హోప్ సంస్థ స్థాపకులు సొంఘా రోషన్, ఎన్ఆర్ఐ బొమ్మాజీ అనిల్…ఈ నలుగురు ఇప్పుడు చింతలపూడి సీటు రేసులో ఉన్నారు. అయితే టిడిపి అధిష్టానం మాత్రం అనిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

అనిల్ ఎన్ఆర్ఐ అయినప్పటికి..ఆయన తండ్రి పశ్చిమగోదావరి జిల్లా మాజీ కలెక్టర్గా పనిచేసిన దివంగత బొమ్మాజీ దానం, అలాగే సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ బీఎన్ విజయ్ కుమార్ సోదరుడు. అలాగే ఎస్సీల్లో మాల వర్గం. ఇప్పటికే పశ్చిమలో కొవ్వూరు, గోపాలాపురం రిజర్వడ్ సీట్లు మాదిగ వర్గానికి కేటాయించారు. దీంతో చింతలపూడి మాల వర్గానికి కేటాయించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికైతే చింతలపూడి సీటు అనిల్కే దక్కుతుందని ప్రచారం నడుస్తోంది.
