గత ఎన్నికల్లో టిడిపికి జనసేన దెబ్బ గట్టిగానే తగిలిన విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం…వైసీపీకి లాభం జరిగింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీపై ఉన్న వ్యతిరేకత పెరుగుతుండటం వల్ల కొన్ని జిల్లాలో టిడిపికి ఇబ్బంది లేకపోయినా..ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన దెబ్బ టిడిపికి తగిలేలా ఉంది.

తాజాగా ఇచ్చిన ఆత్మసాక్షి సర్వేలో సైతం అదే తేలింది. ఎవరికి వారు సింగిల్ గా పోటీ చేస్తే రాష్ట్రంలో టిడిపికి 78, వైసీపీకి 63, జనసేనకు 7 సీట్లు వస్తాయని, 27 సీట్లలో టిడిపి-వైసీపీల మధ్య పోటీ ఉంటుందని సర్వేలో తేలింది. అంటే కొద్దో గొప్పో లీడ్ టిడిపికే ఉంది. కానీ అదే సమయంలో కొన్ని జిల్లాల్లో జనసేన వల్ల టిడిపికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు..ఇక్కడ సర్వే ఫలితాలు చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.ఉమ్మడి తూర్పు గోదావరిలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ లీడ్ ఎవరికి రావడం లేదు. టిడిపి 6, వైసీపీ 6 సీట్లు గెలుస్తుందని, జనసేన 4 సీట్లు గెలుస్తుందని తేలింది. ఇక 3 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉండగా టిడిపి 8, వైసీపీ 2, జనసేన 3 స్థానాల్లో గెలుస్తుందని, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

అయితే తూర్పులోనే టిడిపికి భారీ నష్టం జరిగేలా ఉంది. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తులో వెళితే రెండు జిల్లాల్లో భారీగా సీట్లు గెలుచుకోవడం ఖాయం..వైసీపీకి భారీ నష్టం జరుగుతుంది.