ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం పట్టు లేని సీట్లలో యర్రగొండపాలెం కూడా ఒకటి. ఇక్కడ టిడిపి ఇంతవరకు గెలవలేదు. ఎస్సీ స్థానం కావడం..అక్కడ మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది..ఆ తర్వాత వైసీపీ హవా నడుస్తోంది. ఎస్సీలు వైసీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక్కడ వరుసగా టిడిపి ఓడిపోతుంది.
అయితే గత ఎన్నికల్లో ఇక్కడ ఆదిమూలపు సురేష్ వైసీపీ నుంచి గెలిచారు. టిడిపి నుంచి అజితా రావు పోటీ చేసి ఓడిపోయారు. ఇక సురేష్ మంత్రి అయ్యి ఉండి కూడా నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. అభివృద్ధి పెద్దగా లేదు. ఏదో పథకాలు మాత్రం అందుతున్నాయి. పైగా ఇక్కడ మంత్రిపై సొంత పార్టీ వాళ్లే అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మాజీ సర్పంచ్ మారంరెడ్డి మల్లారెడ్డి నీళ్ల ట్యాంకుల బిల్లులు ఇప్పించాలని పెద్ద ఎత్తున కేకలు పెట్టారు.

కానీ మంత్రి మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. సంక్షేమ పథకాల లెక్కలు చెబుతుండగా… అవన్నీ అందరికీ తెలుసని, గ్రామాలకు ఏమి చేశారో చెప్పాలని సొంత పార్టీ వాళ్లే ప్రశ్నించారు. అంటే నియోజకవర్గంలో అభివృద్ధి లేదని అర్ధమవుతుంది. ఒకవేళ ఏమైనా పనులు చేసిన బిల్లులు రావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల వల్ల మంత్రికి వ్యతిరేకత ఉంది.
అయితే ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టిడిపి విఫలమవుతుంది. నియోజకవర్గంలో ప్రజలని తిప్పుకోలేకపోతున్నారు. పైగా ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు, అజితా రావు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. అటు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు సైతం టిడిపిలోకి రావడానికి ఛుస్తున్నారు. మొత్తానికి యర్రగొండపాలెంలో వైసీపీకి మైనస్ ఉన్నా టిడిపికి ప్లస్ లేదు.
