ప్రత్తిపాటి పుల్లారావు ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి టిడిపిలో పనిచేస్తున్నారు. చిలకలూరిపేటలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో ఆయన గెలిచారు. అలాగే ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. అయితే గత ఎన్నికల్లో రాజకీయాల్లో జూనియర్ అయిన విడదల రజిని..ప్రత్తిపాటిని ఓడించారు.
ఎన్ఆర్ఐగా వచ్చిన ఆమె.. మొదట టిడిపిలో చేరారు. ప్రత్తిపాటి వెనుకే రాజకీయం నేర్చుకున్నారు. కానీ 2019 ఎన్నికల ముందు టిడిపిని వదిలి వైసీపీలోకి జంప్ కొట్టి..మర్రి రాజశేఖర్ లాంటి సీనియర్ని సైది చేసి సీటు తెచ్చుకున్నారు. ఇక జగన్ గాలిలో పేట నుంచి 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా తొలిసారి రజిని పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక త్వరగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించారు. ఇక రెండోవిడతలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇలా పూర్తిగా ఆమె పేటపై పట్టు సాధించే దిశగా వెళుతున్నారు.
దీంతో మొన్నటివరకు రజినిపై నేరుగా విమర్శలు చేయని ప్రత్తిపాటి..ఇప్పుడు నేరుగా విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రజిని అనుచరుల అక్రమాలకు అంతు లేదని అంటున్నారు. పేటలో వైన్స్ మొత్తం రజిని ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇలా రజిని టార్గెట్ గా ప్రత్తిపాటి దూకుడు పెంచారు. ఈ సారి పేటలో ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు.
అయితే అటు రజిని కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు..కాకపోతే కాస్త వ్యతిరేకత ఉంది..అలాగే సొంత పార్టీలోని సీనియర్ మర్రిని పక్కన పెట్టడంతో ఆ వర్గం యాంటీ అయింది. మొత్తానికైతే ఈ సారి పేటలో ప్రత్తిపాటి వర్సెస్ రజిని వార్ హోరాహోరీగా జరగనుంది. మరి ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి.