యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్న నారా లోకేష్..ఏ నెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చి..తర్వాత గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఉంటుంది. ఈ నెల 21న గన్నవరంలో భారీ సభ జరగనుంది. ఈ సభపైనే టిడిపి నేతలు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చంద్రబాబు మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాలని కవర్ చేసి పర్యటించారు.
ఇప్పుడు లోకేష్ విజయవాడ, గన్నవరంల్లో పర్యటించనున్నారు. అయితే గన్నవరం సభపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. అక్కడ టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వల్లభనేని వంశీ..ఏ విధంగా టిడిపిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. అయితే ఆయనపై టిడిపి నుంచి సరైన అభ్యర్ధి లేరు. బచ్చుల అర్జునుడు చనిపోవడంతో టిడిపికి మరో ఇంచార్జ్ ని పెట్టలేదు. ఇప్పటికే గన్నవరం సీటు కోసం పలువురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అంశం హాట్ టాపిక్ అయింది. ఈయనకు, వంశీతో పడటం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ సీటు వంశీకి ఫిక్స్.
దీంతో తాజాగా ఆత్మీయ సమావేశం పెట్టిన యార్లగడ్డ సీటు తనకు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఇవ్వకపోతే గన్నవరం ప్రజలే తన భవిష్యత్తుని నిర్ణయిస్తారు. ఏదేమైనా ఈయన గన్నవరం బరిలో ఉండటానికే చూస్తున్నారు. ఇక టిడిపిలోకి వచ్చి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. ఇక లోకేష్ పాదయాత్ర గన్నవరంలోకి ఎంట్రీ ఇవ్వగానే యార్లగడ్డ టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
ఇక యార్లగడ్డ టిడిపిలోకి వస్తే..వంశీకి గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వంశీ, యార్లగడ్డ..ఇద్దరు బరిలో ఉంటే..టఫ్ ఫైట్ తప్పదనే పరిస్తితి. గన్నవరంలో ఇటు టిడిపి, అటు వైసీపీ శ్రేణులు బలంగా ఉన్నాయి. వంశీ, యార్లగడ్డలకు ఆర్ధికంగా బలం ఉంది. అయితే వంశీకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అదే సమయంలో యార్లగడ్డకు వైసీపీలో అసలైన కార్యకర్తల సపోర్ట్ ఉంది. వారు యార్లగడ్డకు మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి యార్లగడ్డ టిడిపిలోకి రావడం, లోకేష్ పాదయాత్ర గన్నవరంలో వంశీకి డేంజర్ బెల్స్ మోగించినట్లే.