గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొట్టిన సీట్లలో బాపట్ల ఎంపీ సీటు కూడా ఒకటి. ఈ ఎంపీ సీటు పరిధిలో ఉండే పర్చూరు, అద్దంకి, చీరాల, రేపల్లె అసెంబ్లీ సీట్లని టిడిపి గెలుచుకుంది. అటు బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు సీట్లని వైసీపీ గెల్చుకుంది. కానీ బాపట్ల ఎంపీ సీటు వచ్చేసరికి కేవలం 16 వేల ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది.
టిడిపి ఓడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వైసీపీ గాలి.అప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాల్యాద్రిపై వ్యతిరేకత. ఈ పరిణామాలు స్వల్ప మెజారిటీతో టిడిపి ఓడిపోయేలా చేశాయి. ఇక వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన నందిగం సురేష్ పై ఇప్పుడు వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. బాపట్లకు ఏమి చేయని సురేష్కు మళ్ళీ సీటు ఇస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ టిడిపి నుంచి ఎవరు బరిలో ఉంటారనేది పెద్ద చర్చగా మారింది. మళ్ళీ మాజీ ఎంపీ మాల్యాద్రికి సీటు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
గత ఎన్నికల్లోనే మాల్యాద్రికి సీటు ఇవ్వకూడదని కొందరు టిడిపి శ్రేణులు డిమాండ్ చేశాయి. కానీ బాబు మళ్ళీ ఆయనకు సీటు ఇచ్చారు. ఈ సారి మాత్రం మొహమాట పడే పరిస్తితి లేదు. గెలిచేవారికే సీటు ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ తాడికొండ సీటుతో కొన్ని సమీకరణలు లింక్ పడి ఉన్నాయి. తాడికొండ సీటు శ్రావణ్ కుమార్కు ఇస్తే..బాపట్ల ఎంపీ సీటు ఉండవల్లి శ్రీదేవి లేదా కొలికిపూడి శ్రీనివాసరావుకు ఇస్తారనే ప్రచారముంది.
అది కాకపోతే తాడికొండ కొలికిపూడికి ఇస్తే..బాపట్ల శ్రావణ్కు ఇస్తారని అంటున్నారు. ఇలా రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అయితే తాడికొండ, బాపట్ల సీట్లు టిడిపి ఖచ్చితంగా గెలిచే సీట్లు..కాబట్టి బలమైన అభ్యర్ధులని దింపడానికే బాబు చూస్తున్నారు. చివరికి ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.