వైసీపీలో ఆధిపత్య పోరు రోజుకురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు పడటం లేదు. కొందరు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టి సీటు దక్కించుకోవాలని కొందరు నేతలు చూస్తున్నారు. ఇప్పటికే చాలా స్థానాల్లో పోరు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ సౌత్ వైసీపీలో రచ్చ ఎప్పటినుంచో నడుస్తుంది.
ఇక్కడ టిడిపి నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ వాసుపల్లికి మొదట నుంచి ఉంటున్న వైసీపీ శ్రేణులకు పడటం లేదు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో వాసుపల్లికి సీటు ఇస్తే సహకరించని పరిస్తితి ఉంది. ఇటు వాసుపల్లి సైతం..కొందరు వైసీపీ నాయకులని పక్కన పెట్టేస్తున్నారని తెలుస్తుంది. దీంతో అక్కడ వైసీపీలో రచ్చ నడుస్తుంది. వాసుపల్లి గణేష్ కుమార్కు, ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయిన సీతoరాజు సుధాకర్కు పొసగడం లేదు.
అటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన కోలా గురువులు సైతం సౌత్ పైనే గురి పెట్టారు. ఈ ఇద్దరు సౌత్ సీటు కోసం ట్రై చేస్తుండటంతో వాసుపల్లికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీనికి తోడు కోలా అటు సగానికి పైగా కార్పొరేటర్లు వాసుపల్లిని వ్యతిరేకించడం సౌత్ వైసీపీలో సెగలు పుట్టిస్తోంది. ఇక వాసుపల్లి తనదైన శైలిలో ముందుకెళ్లిపోతున్నారు. వైసీపీ అధిష్టానం తనకే సీటు ఇస్తుందనే ధీమాలో ఉన్నారు. అయితే సీటు దక్కిన చిక్కులు తప్పవు. ఎందుకంటే సీతంరాజు, కోలా వర్గాలు సహకరించే పరిస్తితి ఉండదు. దీని వల్ల వాసుపల్లికి ఇబ్బందే. అదే సమయంలో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే వాసుపల్లికి చెక్ పడిపోతుంది.