కృష్ణా జిల్లాలో ఈ సారి తెలుగుదేశం పార్టీ హవా నడిచేలా ఉంది. మొదట నుంచి జిల్లాలో టిడిపికి పట్టు ఎక్కువ. కానీ గత ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. కానీ వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో టిడిపి బలపడుతుంది. ఈ సారి కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో టిడిపి ఆధిక్యం సాధించే దిశగా వెళుతుంది.అందులో డౌట్ లేకుండా పెడన, బందరు సీట్లని టిడిపి కైవసం చేసుకునేలా ఉంది.
గత ఎన్నికల్లో ఈ రెండు సీట్లని తక్కువ ఓట్ల మెజారిటీతోనే టిడిపి ఓడిపోయింది. పైగా జనసేన ఓట్లు చీల్చడం మైనస్ అయింది. పెడనలో టిడిపి నుంచి కాగిత కృష్ణప్రసాద్ కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ జనసేనకు 25 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఇక బందరులో కొల్లు రవీంద్ర 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ జనసేనకు 20 వేల ఓట్లు వరకు పడ్డాయి. పెడనలో జోగి రమేష్, బందరులో పేర్ని నాని గెలిచారు.
మొదట విడతలో పేర్ని, రెండో విడతలో జోగి మంత్రులు అయ్యారు. ఇద్దరు మంత్రులుగా తమ తమ స్థానాల్లో చేసే అభివృద్ధి శూన్యం. అలాగే ప్రజలకు అండగా ఉండటం కంటే చంద్రబాబు, పవన్ లని తిట్టడానికే వీరిద్దరు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశాలే మైనస్ అవుతున్నాయి. పెడనలో జోగి మళ్ళీ గెలవడమే డౌట్ అని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ కాగితకు మంచి అవకాశాలు ఉన్నాయి.
అటు బందరులో పేర్ని వారసుడు పోటీ చేసే ఛాన్స్ ఉంది..ఇక ఎవరు పోటీ చేసిన టిడిపి నుంచి కొల్లు హవా నడిచేలా ఉంది. జనసేనతో పొత్తు లేకపోయినా వీరి గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని తెలుస్తుంది. పొత్తు ఉంటే మంచి మెజారిటీలు వస్తాయి.