ఏజెన్సీ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేదనే చెప్పాలి. అక్కడ మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ స్థానాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అరకు, పాడేరు స్థానాలని వైసీపీ గెలుచుకుంది. గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ గెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అధికారంలో ఉండి కూడా గిరిజన ప్రజలకు వైసీపీ చేసింది ఏమి లేదు. సరైన అభివృద్ధి లేదు. సరైన వసతులు ఉండవు.
పైగా ఇటీవల వైసీపీ ప్రభుత్వం వాల్మీకి, బోయలని ఎస్టీల్లో చేరుస్తూ..అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలో ప్రయోజనం పొందడానికి అక్కడ ఎక్కువగా ఉన్న వాల్మీకి, బోయలని ఎస్టీ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు..కానీ దీని వల్ల వైసీపీకి గిరిజనులు దూరమవుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో టిడిపి గిరిజనులని దగ్గర చేసుకునే విధంగా ముందుకెళ్లవచ్చు.
కానీ టిడిపి నేతలు ఆ పని చేయడం లేదు..తాజాగా అరకు, పాడేరు ఎమ్మెల్యేలని గిరిజనులు ఎక్కడకక్కడ అడ్డుకుంటు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక వారికి మద్ధతుగా నిలబడితే టిడిపికి ప్లస్ అవుతుంది. కానీ టిడిపి నేతలు ఆ విధంగా ముందుకెళ్లడం లేదు. అందుకే ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో టిడిపి వెనుకబడే ఉంది. అరకు, పాడేరు లాంటి స్థానాల్లో టిడిపి పుంజుకోవడం లేదు. అలాగే ఇక్కడ నాయకులు సైతం యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.
అరకులో కిడారి శ్రావణ్ కుమార్ ఏమైపోయారో ఎవరికి తెలియదు..ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. అటు పాడేరులో గిడ్డి ఈశ్వరి సైతం అంతగా యాక్టివ్ గా ఉండటంలేదు.ఇలా ఉండటం వల్లే రెండుచోట్ల టిడిపి ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పవచ్చు.