రాజు..ఎక్కడున్న రాజే అంటూ బాహుబలి సినిమాలో ప్రభాస్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్ టిడిపి అధినేత చంద్రబాబుకు బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆయనని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా సరే ఒక ప్రజా నాయకుడు ఎలా ఉంటారో అలాగే బాబు పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు..పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు బయట ఉన్నప్పుడే కాదు..రిమాండ్ లో ఉన్నా కూడా బాబు అదే పనిలో ఉన్నారు.
మామూలుగా కొందరు నేతలు జైల్లో ఉంటే ఎంత సానుభూతి వస్తుందని లెక్కలు వేసుకుంటారు. కానీ బాబు అలా కాదు. జైల్లో ఉన్నా సరే ప్రజా సమస్యలు, పార్టీ గురించే ఆలోచిస్తున్నారు. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలిన తొణకడం లేదు..బెణకడం లేదు..వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం టిడిపి నేతలతో మాట్లాడుతూనే ఉన్నారు. బాబు అరెస్ట్ వల్ల ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. అటు లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. టిడిపి కార్యక్రమాలు ఆగిపోయాయి.
అవన్నీ మళ్ళీ మొదలుపెట్టే విధంగా బాబు జైల్లో నుంచి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్, యనమల రామకృష్ణుడు బాబుతో ములాఖత్ అయ్యారు. వారికి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో గైడెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాబు ఆదేశాలతో తాజాగా 15 మందితో పోలిటికల్ యాక్షన్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో అన్నీ వర్గాలకు వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
అటు లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. అక్టోబర్ 1 నుంచి పాదయాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రజా సమస్యలపై టిడిపి నేతలు పోరాటం మొదలుపెట్టనున్నారు. ఓ వైపు బాబు కోసం న్యాయ పోరాటం చేస్తూనే..మరో వైపు ప్రజా సమస్యలపై పోరాటం…పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు జరగనున్నాయి.