రాజకీయం రాజకీయంగానే చేయాలి..అలా కాకుండా కుట్రలు, కుతంత్రాలు చేయడం, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రజలని మభ్యపెట్టి, ప్రత్యర్ధులని దెబ్బకొట్టి గెలవడం అనేది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అనే సంగతి రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతారు. గత ఎన్నికల ముందు వైసీపీ ఎలాంటి వ్యూహాలు పన్నింది..న్యూట్రల్ ముసుగులో కొందరు వ్యక్తులు టిడిపిపై ఎలా విషం చిమ్మి వైసీపీకి లాభం చేశారో తెలుసు.
కమ్మ కులం, పింక్ డైమండ్, కాపులని రెచ్చగొట్టడం, కులాల వారీగా గొడవలు..అబ్బో ఇలా ఒకటి ఏంటి రకరకాలుగా రాజకీయం చేసి టిడిపిని దెబ్బతీశారు. ఇక పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కేసిఆర్, టిఆర్ఎస్ నేతలు జగన్కు మద్ధతు తెలపడం, బిజేపి పెద్దల సపోర్ట్ ఇలా అన్నిరకాలుగా జగన్ పై చేయి సాధించారు. ఆఖరికి రాజకీయ కుట్రల్లో సినిమాలు కూడా భాగం అయ్యాయి. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తీసి..జగన్పై సానుభూతి పెరిగేలా చేయడం…దర్శకుడుగా విఫలమవుతున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీసి చంద్రబాబుని నెగిటివ్ చేయడం చేశారు.
ఇలా రకరకాలుగా టిడిపిని దెబ్బతీసి..2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో రాజకీయం నడుస్తోంది. కొందరు పెద్దలు జగన్కు మద్దతుగానే ఉన్నారు. కేసిఆర్, అసదుద్దీన్ లాంటి వారు సపోర్ట్ చేస్తున్నారు. అటు కులాల కుంపట్లు, ఉన్నవి లేనివి కల్పించి రాజకీయం నడిపించడం, గొడవలు, దాడులు, కేసులు..అబ్బో ఒకటి ఏంటి చాలా నడుస్తున్నాయి.
ఇదే సమయంలో జగన్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర-2 సినిమా వస్తుంది. అటు రామ్ గోపాల్ వర్మ సైతం వ్యూహం, శపథం అంటూ రెండు పార్టులు సినిమాలు తీస్తున్నారు. జగన్ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో గెలవడం, వివేకా హత్య లాంటి అంశాలపై సినిమాలు తీస్తున్నారు. రాజకీయాలని ప్రభావితం చేసి మళ్ళీ జగన్ని గెలిపించాలనే సినిమాలు తీస్తున్నారు. మరి వీటిని ఈ సారి జనం ఎంతవరకు నమ్ముతారు..మళ్ళీ మద్ధతు ఇస్తారా? లేక వాటిల్లో నిజమెంత…అబద్దాలు ఏంటి అనేది తెలుసుకుని..వైసీపీకి చెక్ పెడతారా? అనేది చూడాలి.