చంద్రబాబు కంచుకోట కుప్పంని సొంత చేసుకోవడానికి వైసీపీ ఎన్ని రకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అధికార బలాన్ని వాడి కుప్పంపై పట్టు సాధించడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ అంతే ధీటుగా చంద్రబాబు సైతం..కుప్పంలో వైసీపీకి చెక్ పెట్టే దిశగా వెళుతున్నారు. కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేయిస్తున్నారు. అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..తన సొంత స్థానం పుంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడే ఉంటూ రాజకీయం నడిపిస్తున్నారు.
ఎలాగో అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీని గెలుచుకున్నారు. అలాగే కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటామని అతున్నారు. అయితే అది సాధ్యమయ్యే పని కాదనే సంగతి తెలిసిందే.మళ్ళీ అక్కడ బాబు బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం. ఇదే క్రమంలో కుప్పంలో లక్ష మెజారిటీ రావడమే టార్గెట్ గా ఎమ్మెల్సీ శ్రీకాంత్ చౌదరీని ఇంచార్జ్ గా పెట్టారు. శ్రీకాంత్ ఇంచార్జ్ గా వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ కావడంతో కుప్పం మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్ గా నమోదు చేయించుకున్నారు.
దీంతో పెద్దిరెడ్డికి ధీటుగా శ్రీకాంత్ రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ఇటీవల కుప్పంలో టిడిపి నేతలకు సత్తా లేక ప్రకాశం జిల్లా నుంచి అద్దె నేతని తెచ్చుకున్నారని శ్రీకాంత్ని ఉద్దేశించి పెద్దిరెడ్డి విమర్శలు చేశారు. దీనికి శ్రీకాంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కుప్పంకు అద్దె నాయకుడు “ నువ్వా..? నేనా..? “ అని మంత్రిని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గం పుంగునూరును వదిలి తరచూ కుప్పం వస్తున్నారని, తూర్పు రాయలసీమ శాసనమండలి స్థానం పరిధిలోని కుప్పంలో 4వేల మంది గ్రాడ్యుయేట్లు తనకు ఓటు వేశారని గుర్తు చేశారు.
అలాగే 36 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ స్థానంలో కుప్పం కూడా ఉందని, కుప్పంని ప్రోటోకాల్ గా ఎంచుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, బీసీ నేత భరత్ ఉండగా..పెద్దిరెడ్డి వచ్చి పెత్తనం చేస్తున్నారని, అంటే భరత్కు చేతకాదా? నాయకత్వ లక్షణాలు లేవా…? అని ప్రశ్నించారు.ఇలా పెద్దిరెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా శ్రీకాంత్ రాజకీయం చేస్తూ..కుప్పంలో బాబుకి భారీ మెజారిటీ తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నారు.