ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సారి కొందరు వైసీపీ ఎమ్మెల్యే తట్టా బుట్టా సర్దేసుకోవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఏదో జగన్ గాలిలో గెలిచేశారు గాని..ఈ సారి జగన్ గాలి ఉండదు..పైగా వ్యతిరేక గాలి ఉంది..దీంతో కృష్ణాలో వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు కనబడటం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో సీనియర్లుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సారి ఓటమి బాటపట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.
ఆ ముగ్గురు సీనియర్లు ఎవరో కాదు..ఒకప్పుడు కాంగ్రెస్ లో, ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్న మల్లాది విష్ణు, సామినేని ఉదాయభాను, పార్థసారథి. ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా పనిచేశారు..ఇందులో సారథి మంత్రిగా కూడా చేశారు. అయితే కాంగ్రెస్ దెబ్బతినడంతో ముగ్గురు వైసీపీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో ముగ్గురు నేతలు గెలిచారు. మల్లాది విజయవాడ సెంట్రల్ లో 25 ఓట్ల తేడాతో గెలిస్తే..జగ్గయ్యపేటలో సామినేని 4 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇటు సారథి పెనమలూరులో 11 వేల ఓట్లతో గెలిచారు.
ఇలా ముగ్గురు జగన్ గాలిలో గెలిచారు. అయితే సీనియర్లు కావడంతో మంత్రి పదవి ఆశించారు..కానీ ఒక్కరికీ కూడా పదవి దక్కలేదు. దీంతో ముగ్గురు పెద్దగా దూకుడుగా పనిచేయడం లేదు. అలాగే వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి తక్కువే. అలాగే అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక ఈ మూడు స్థానాలు టిడిపి కంచుకోటలే. మూడు చోట్ల టిడిపి నేత పుంజుకున్నారు. సెంట్రల్లో బోండా ఉమా, పెనమలూరులో బోడే ప్రసాద్, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య ఆధిక్యంలోకి వచ్చారు. లేటెస్ట్ సర్వేల్లో ముగ్గురు గెలవడం ఖాయమని తేలింది. దీంతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా సర్దేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.