అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చెప్పాలి. ఆ పార్టీలో ప్రధానమైన పదవులు రెడ్డి వర్గానికే దక్కాయనే సంగతి తెలిసిందే. అలాగే గత ఎన్నికల్లో రెడ్డి నేతలకే ఎక్కువ సీట్లు కేటాయించారు. వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది పైనే రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారంటే..వైసీపీలో రెడ్డి వర్గం హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇలా ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీలో ఈ సారి కొందరు రెడ్డి ఎమ్మెల్యేలు గెలవడం కష్టమని సర్వేలు తేల్చి చెప్పేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి నేతలు ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ గెలిచారు. కానీ ఈ సారి సగానికి సగం మంది ఓటమి బాటపట్టేలా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలకు రిస్క్ ఎక్కువ ఉంది. అనంతలో 14 సీట్లు ఉన్నాయి. అందులో 12 సీట్లు వైసీపీ, 2 సీట్లు టిడిపి గెలిచింది.
12 మందిలో 8 మంది రెడ్డి ఎమ్మెల్యేలే. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దరెడ్డి, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి, గుంతకల్లో వై. వెంకట్రామి రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, అనంత అర్బన్ లో అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాయదుర్గం లో కాపు రామచంద్రారెడ్డి..అయితే ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
అంటే అనంతలో 14 సీట్లు ఉంటే 9 సీట్లు రెడ్లకే ఇచ్చారు. అందులో 8 మంది గెలిచారు. ఇక ఈ 8 మందిలో ఈ సారి గెలుపు గుర్రం ఎక్కేది తక్కువ మందే. ధర్మవరంలో ఒక కేతిరెడ్డి మినహా మిగిలిన వారందరికి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మొత్తానికి ఈసారి అనంత రెడ్లకు గట్టి షాక్ తగిలేలా ఉంది.