గడపగడపకు సమీక్షా సమావేశంలో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు పెద్దగా గడపగడపకు వెళ్ళడం లేదని వారి పేర్లు చెప్పనని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని జగన్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక సరిగ్గా పనిచేయకపోతే సీట్లు కూడా ఇవ్వనని అన్నారు. అయితే గడపగడపకు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధం లేదనే చెప్పాలి. గడపగడపకు తిరిగిన ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పడానికి లేదు. గడపగడపకు అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందే లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి..మీకు పథకాల ద్వారా ఇన్ని డబ్బులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
అంతే తప్ప..ప్రజా సమస్యలని తెలుసుకోవడం లేదు..వాటిని పరిష్కరించడం లేదు..నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడం లేదు..ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైనే ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. కేసులు పెట్టిస్తున్నారు. కాబట్టి గడపగడప అనేది పెద్దగా ఎమ్మెల్యేలకు ప్లస్ అవ్వదు. పనితీరు బాగుంటేనే గెలవగలరు. అయితే పనితీరు బాగోని ఎమ్మెల్యేలు భారీగానే ఉన్నారని తెలిసింది.
దాదాపు 65 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగు లేదని తెలిసింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అందులో 65 తీస్తే..86 మంది ఎమ్మెల్యేలు..అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. దీని బట్టి చూస్తే వైసీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ 86 లో కూడా బాగా పనిచేసేవారు తక్కువగానే ఉన్నారు. పైగా ప్రభుత్వంపై వ్యతిరేకత, టిడిపి బలపడటం, జనసేనతో పొత్తు లాంటి అంశాలు లెక్క వేసుకుంటే..వైసీపీకి ఈ సారి భారీ దెబ్బ తగిలేలా ఉంది.
పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని జగన్ అన్నారు..అలా అంటే ఎంతమందికి జగన్ సీట్లు ఇవ్వకుండా ఉండగలరు. ఎక్కువ మందికి సీట్లు ఇవ్వకపోతే వైసీపీకే నష్టం. సీట్లు దక్కని వారు జంప్ అవ్వడం గాని, పార్టీ గెలుపుకు సహకరించకపోవడం గాని చేస్తారు. దీని వల్ల వైసీపీకే డ్యామేజ్.