ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం…ఇది ఒకప్పుడు టిడిపి కంచుకోట…కానీ ఇప్పుడు అక్కడ టిడిపిలోని గ్రూపు తగాదాలు పెద్ద ఇబ్బందిగా మారిపోయాయి. దీని వల్ల టిడిపి రేసులో వెనుకబడిపోయింది. 2014లో కూడా ఇక్కడ టిడిపి సత్తా చాటింది. టిడిపి నుంచి పీతల సుజాత గెలిచారు..మంత్రిగా చేశారు. కానీ ఆమె సరైన పనితీరు కనబర్చలేదు. దీంతో ఆమెని చంద్రబాబు పక్కన పెట్టేసి..2019లో టిడిపి సీటు కర్రా రాజారావుకు ఇచ్చారు.
జగన్ గాలిలో ఈయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో చింతలపూడి టిడిపి ఇంచార్జ్ పదవి ఖాళీగా ఉంది. కానీ ఈ సీటు కోసం చాలామంది నేతలు పోటీపడుతున్నారు. అలాగే ఇంచార్జ్ పదవి కోసం కమ్మ నేతలు కూడా ట్రై చేశారు. కానీ బాబు ఎవరికి ఇవ్వలేదు. కాకపోతే నియోజకవర్గంలో నేతల పనితీరుని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ గ్రూపు తగాదాలు కనిపిస్తున్నాయి.
పైగా సీటు కోసం పోటీ పెరుగుతూనే వస్తుంది..ఇటు మాజీ మంత్రి పీతల సుజాత తన ప్రయత్నాలు ఆపలేదు. ఇదే క్రమంలో అనూహ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన దానం కుమారుడు అనిల్ పేరు తెర మీదకు వచ్చింది. అనిల్ సోదరుడు విజయ కుమార్ సంతనూతల పాడు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొంది ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.
ఇక అనిల్ పేరు నడుస్తుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు అల్లుడు రాజేశ్ పేరు తెరపైకి వచ్చింది. ఈయన కూడా చింతలపూడి సీటు ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే రామాంజనేయులు..గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు సీటు ట్రై చేస్తున్నారు. అయితే వీరిలో ఎవరోకరికి సీటు ఇస్తానని బాబు హామీ ఇచ్చారట. అంటే ప్రత్తిపాడు రామాంజనేయులుకు దక్కితే..చింతలపూడి ఆయన అల్లుడుకు దక్కదు..వేరే వాళ్ళకు ఇస్తారు. లేదంటే రాజేశ్కు చింతలపూడి దక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ రెండు సీట్లు లింక్ అయ్యి ఉన్నాయి.