రాజకీయాల్లో గెలుపోటములని డిసైడ్ చేసే శక్తి మహిళా ఓటర్లకే ఎక్కువ ఉంటుందని చెప్పాలి. వారు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. గత ఎన్నికల్లో జగన్ చెప్పిన మద్యపాన నిషేధం..కొన్ని పథకాల హామీల వల్ల మహిళలు వైసీపీ వైపు నిలబడ్డారు. దీని వల్ల మెజారిటీ మహిళా ఓట్లు వైసీపీకి పడటం వల్ల టిడిపి ఓడిపోయింది. వైసీపీ గెలిచి అధికారం లోకి వచ్చింది.
అయితే ఈ సారి మహిళలని తమ వైపుకు తిప్పుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎలాగో మద్యపాన నిషేధంపై మాట తప్పారు. పలు పథకాలలో కోతలు విధించారు. అటు అన్నీ రకాల పన్నుల బాదుడు ఉంది. ఈ పరిణామాలతో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంగానే ఉన్నారు. ఈ క్రమంలో మహిళల మద్ధతు పెంచుకునేలా చంద్రబాబు..మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే మహిళలకు ఏం చేస్తారో క్లారిటీగా చెబుతున్నారు.
మహాశక్తిలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..18-60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500.. ఎలాగో 60 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్ వస్తుంది. ఇటు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి..రూ.15 వేలు..ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు..ముగ్గురు ఉంటే రూ.45 వేలు ఇస్తారు.
ఇలా మహిళలకు భారీ పథకాలు ప్రకటించారు. ఈ పథకాల గురించి పూర్తిగా మహిళలకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి మహిళా నేతలు ప్రతి ఇంటికెళ్ళి మహాశక్తి పథకాల గురించి వివరించనున్నారు. ఈ మహాశక్తి ద్వారా టిడిపికి మహిళల ఓటు శక్తి పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే గెలుపు కూడా వన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.