రాష్ట్రంలో పవన్ వర్సెస్ వాలంటీర్లు అన్నట్లు పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ అనూహ్యంగా వాలంటీర్లని టార్గెట్ చేయడం…రాష్ట్రంలో మిస్ అవుతున్న మహిళలకు కారణం వాలంటీర్లు అని ఆరోపించడం..అలాగే వాలంటీర్లు ప్రతి కుటుంబం సమాచారాన్ని సేకరించి..వైసీపీకి ఇస్తుందని, దాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. వాలంటీర్ల చేత వైసీపీ తప్పులు చేయిస్తుందని,తర్వాత వాలంటీర్లే ఇబ్బంది పడతారని అంటున్నారు.
అయితే పవన్ చేసే వ్యాఖ్యలపై వాలంటీర్లు నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జనసేనకు ఒక్క వాలంటీర్ కూడా పడదని, పైగా సచివాలయాలని కూడా పవన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వారి ఓట్లు కూడా పవన్కు పడవని అంటున్నారు. వాలంటీర్లు 2.60 లక్షలు ఉన్నారని, సచివాలయ ఉద్యోగులు లక్షా 20 వేలు ఉన్నారని, అంటే దాదాపు 3.80 లక్షల ఓట్లు జనసేనకు పోయినట్లే అని విశ్లేషణలు వస్తున్నాయి.
ఇక దీనికి జనసేన నేతలు కొత్త లెక్కలు చెబుతున్నారు. అసలు వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలు అని..90 శాతం వాళ్ళే అని, అలాంటప్పుడు ఆ ఓట్లు తమకు ఎలా పడతాయని అనుకుంటామని, వారి ఓట్లపై తమకు ఆశలు లేవని, అలాగే సచివాలయ ఉద్యోగులు ఎంతవరకు జనసేనకు ఓటు వేస్తారని తెలియదని అంటున్నారు.
అదే సమయంలో జగన్ వైసీపీ వాళ్ళకే వాలంటీర్ పోస్టులు ఇచ్చి…రాష్ట్రంలో దాదాపు 20 లక్షల నిరుద్యోగులని గాలికొదిలేశారని, అసలైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని..ఇక వారంతా జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, వారే ఓట్లే తమకు కీలకమని, వారిలో మెజారిటీ సంఖ్య జనసేనకే మద్ధతు ఇస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో యూత్ లో పవన్కు ఫాలోయింగ్ ఉంది. కాబట్టి నిరుద్యోగులు జనసేనకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.