బలమైన నాయకులు, బలమైన కేడర్ ఉండి కూడా టిడిపి ఓడిపోతున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. గత కొన్ని ఎన్నికలుగా టిడిపి ఓడిపోతుంది. అయితే నేతల మధ్య వర్గ పోరు, సమన్వయం లేకపోవడం వల్ల ఓటములు వస్తున్నాయి. అలా టిడిపి వరుసగా ఓడిపోతున్న స్థానాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు కూడా ఒకటి. మొదట్లో ఇక్కడ టిడిపి వేవ్ నడిచింది.
1983, 1985 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. 1989లో ఓడిన..మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ టిడిపి గెలవలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో కేవలం 265 ఓట్ల తేడాతో ఓడింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో కేవలం 1600 ఓట్ల తేడాతో ఓడింది. ఇలా బ్యాడ్ లక్ తో ఓడింది.
అయితే వరుసగా ఓడుతున్న నల్లగట్ల స్వామీదాసుని తప్పించి గత ఎన్నికల్లో కేఎస్ జవహర్ని నిలబెట్టారు. అయినా ప్రయోజనం శూన్యం. కానీ ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చంద్రబాబు, టిడిపి నేతలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే వైసీపీపై వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే రక్షణనిధికి పెద్దగా పాజిటివ్ లేదు. సీటు ఇస్తే సొంత వాళ్ళే ఓడించాలని చూస్తున్నారు.
అలా అని టిడిపి విజయం సులువు కాదు. ఇక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇంచార్జ్ దేవదత్ ఓ వైపు..స్వామీదాస్ మరో వైపు..అటు వాసం మునియ్య మరో వర్గం..ఇలా మూడు వర్గాలకు చీలిపోయారు. దీంతో బాబు అందరినీ పిలిచి క్లాస్ ఇచ్చారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్తుతో కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏమైనా విభేదాలు ఉంటే సరిచేసుకుని కలిసిపనిచేయాలని, తిరువూరులో ఇన్చార్జి పార్టీ కార్యాలయం తప్ప పార్టీ తరఫున మరో కార్యాలయం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనని అన్నారు. ఇక బాబు క్లాస్ పీకడం వల్ల తిరువూరు తమ్ముళ్ళు మారి..ఈ సారైనా అక్కడ టిడిపి జెండా ఎగరవేస్తారేమో చూడాలి.