టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..అమలాపురం అసెంబ్లీ సీటు జనసేనకు దక్కుతుందా? అంటే దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా పవన్..అమలాపురంలో వారాహి యాత్ర చేయగా, అక్కడ భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. అక్కడ జనసేనని బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ ముందుకెళ్లారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ సీటు జనసేనకే అనే ప్రచారం వస్తుంది.
అయితే ఇక్కడ ఎస్సీ ఓట్లతో పాటు కాపుల ఓట్లు ఎక్కువే. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా, రెండో ప్లేస్ లో 51 వేల ఓట్లతో ప్రజారాజ్యం నిలిచింది.టిడిపికి 23 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. 2014లో టిడిపికి జనసేన సపోర్ట్ ఇవ్వడంతో..టిడిపి 12 వేల ఓట్లతో గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో కూడా మరోసారి ఓట్ల చీలిక జరిగింది. టిడిపి, జనసేనల మధ్య ఓట్లు చీలడం వైసీపీకి కలిసొచ్చింది. వైసీపీకి 72 వేలు ఓట్లు పడితే..టిడిపికి 46 వేలు, జనసేనకు 45 వేల ఓట్లు పడ్డాయి.
అంటే టిడిపి, జనసేన ఓట్లు కలిపితే 91 వేలు..వైసీపీ కంటే 19 వేల ఓట్లు ఎక్కువ. కాబట్టి ఈ సారి టిడిపి, జనసేన కలిస్తే వైసీపీకి ఓటమి తప్పదు. కాకపోతే పొత్తు ఉంటే ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది పెద్ద ప్రశ్న. గత ఎన్నికల బట్టి చూస్తే ఇక్కడ టిడిపి, జనసేనలకు సమాన బలం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు పెద్ద బలం లేకపోయినా పొత్తులో భాగంగా ఆ సీట్లని టిడిపి వదులుకోవాల్సిన పరిస్తితి ఉంది. కాబట్టి అమలాపురంలో జనసేనకు బాగానే ఓట్లు వచ్చాయి..అందుకే ఈ సీటు జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది. ఇక టిడిపి ఓట్లు ఎంతవరకు జనసేనకు బదిలీ అయ్యి, వైసీపీని ఓడిస్తారో చూడాలి.