పల్నాడు అంటేనే..ఆ పేరులో ఒక పవర్ ఉంటుంది. పోరాటాల పురిటి గడ్డగా ఉన్న పల్నాడులో రాజకీయం మరింత పవర్ఫుల్గా నడుస్తుంది. ఎక్కడైనా మాటల దాడి వరకే రాజకీయం ఉంటుంది..కానీ పల్నాడులో దాడుల రాజకీయం నడుస్తుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ దాడుల రాజకీయం పెరిగింది. టిడిపి నేతలు, కార్యకర్తలు టార్గెట్ గా ఏ స్థాయిలో దాడులు జరుగుతాయో చెప్పాల్సిన పని లేదు.
ముఖ్యంగా మాచర్లలో ఎలాంటి హింసాత్మక రాజకీయం జరిగిందో తెలిసిందే. టిడిపి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై కర్రలతో దాడులు జరిగాయి. బ్రహ్మయ్య అనే టిడిపి కార్యకర్తని పట్టపగలు గొంతు కోసి చంపేశారు. టిడిపి ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పోలీసులు కూడా వైసీపీ వాళ్ళే అని టిడిపి శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇక మాచర్ల మాత్రమే కాదు. ఆ పెదకూరపాడు, నరసారావుపేట తాజాగా వినుకొండలో ఎలాంటి రచ్చ జరిగిందో తెలిసిందే.
ఇక వైసీపీకి ధీటుగా టిడిపి కూడా నిలబడుతుంది. దీంతో రెండు పార్టీల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే వైసీపీ అధికార బలం, పోలీసుల బలంతో ముందుకెళుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇక దాడులకు ప్రేరేపించింది కూడా వైసీపీనే అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు.
ఈ దాడుల రాజకీయం పూర్తిగా వైసీపీకే రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఓడిపోయాక సైలెంట్ గా ఉన్న టిడిపిని రెచ్చగొట్టి పైకి లేపుతున్నారు. దీంతో వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇస్తుంది. రానున్న ఎన్నికల్లో పల్నాడులో వైసీపీని టిడిపి గట్టి దెబ్బ కొట్టేలా ఉంది.