ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. ఓ వైపు ప్రజల్లో తిరుగుతూనే మరోవైపు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ఎలాగో లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా ఖాళీ లేకుండా నియోజకవర్గాల్లో రోడ్ షోలు, భారీ సభలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సాగునీటి ప్రాజెక్టులని పరిశీలించి..ప్రతి జిల్లాలో బహిరంగ సభలు పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా విశాఖలో స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఫ్రీడం వాక్ చేశారు. విజన్ 2047 డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఆ వెంటనే కోనసీమ పర్యటనకు వచ్చారు. వరుసగా మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. రైతులు, మహిళలు, దళిత వర్గాలతో వరుస సమావేశాలు..రోడ్ షోలు, భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇలా కోనసీమలో బాబు పర్యటించి..కోనసీమపై టిడిపి ఆధిక్యం పెరిగేలా చేయడానికి కృషి చేయనున్నారు. అయితే గతంలో కోనసీమలో టిడిపి హవా ఉండేది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ వేవ్, జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి భారీ నష్టం జరిగింది.
కోనసీమ పరిధిలో కేవలం మండపేట సీటు మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఇప్పుడు అదే మండపేటలో బాబు టూర్ మొదలవుతుంది. అక్కడ ఎలాగో టిడిపికి పూర్తి బలం ఉంది. ఈ సారి కూడా అక్కడ టిడిపి గెలుపు దిశగా వెళుతుంది. ఇక కొత్తపేట..గత నాలుగు ఎన్నికల నుంచి ఇక్కడ టిడిపి ఓడిపోతుంది. అది కూడా తక్కువ మెజారిటీలతో 2004లో 2 వేలు, 2009లో 2 వేలు, 2014లో 713 ఓట్లు, 2019లో 4 వేల ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది.
ఈ సారి గెలుపు దిశగా తీసుకెళ్ళేలా బాబు పర్యటన సాగనుంది. ఇక అమలాపురం సీటు విషయానికొస్తే..ఇక్కడ జనసేనతో పొత్తు బట్టి గెలుపు ఆధారపడి ఉంది. టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడుతుంది.