టిడిపి అధినేత చంద్రబాబు..మరొకసారి నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమవుతూ ఆయా స్థానాల్లో టిడిపి బలంపై వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే తన వద్ద రిపోర్టులతో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని సూచనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బాబు..తిరువూరు, కురుపాం, పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం, పాలకొండ స్థానాల నేతలతో సమావేశమయ్యారు.
అయితే ఈ స్థానాలు అన్నీ టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. ఒక్క పార్వతీపురంలో 2014లో గెలిచింది..కానీ 2019లో మళ్ళీ ఓడింది. ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలని నేతలకు సూచనలు చేశారు. ఇటు కురుపాంలో ఇంతవరకు టిడిపి గెలవలేదు. దీంతో అక్కడ ఇంచార్జ్ తోయిక జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజుతో భేటీ అయ్యి..ఈ సారి ఎలాగైనా గెలవాలని సూచనలు చేశారు. ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుంటే టిడిపిదే గెలుపు. ఇక పాలకొండలో టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. అక్కడ నేతలతో కూడా మాట్లాడి అంతా కలిసికట్టుగా పనిచేయాలని, విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు.
ఇక బొబ్బిలి ఇక్కడ టిడిపి గెలిచి 25 ఏళ్ళు అయింది..ఇప్పుడు అక్కడ గెలుపు దిశగా వెళుతుంది. ఇటు తిరువూరు ఎప్పుడో 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది. మళ్ళీ అక్కడ టిడిపి గెలవలేదు. ఇప్పుడు గెలుపు అవకాశం వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత వాళ్లే ఆయన్ని ఓడిస్తానని అంటున్నారు.
కాకపోతే ఇక్కడ టిడిపి నేతల్లో సఖ్యత లేదు..ఇంచార్జ్ దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామీదాస్, మరో కీలక నేత వాసం మునియ్య..ఇలా ఎవరికి వారే అన్నట్లు పనిచేస్తున్నారు. దీంతో వారందరినీ పిలిచి మాట్లాడి ఐక్యంగా పనిచేయాలని, బస్సు యాత్రని కూడా విజయవంతం చేయాలని సూచించారు. ఇలా టిడిపి గెలవని స్థానాలపై బాబు ఫోకస్ పెట్టి.. ఈ సారి గెలుపే దిశగా ముందుకు తీసుకెళుతున్నారు.