ఏలూరు అసెంబ్లీ సీటు..ఈ సీటుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో..అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 1983లో టిడిపి వచ్చిన దగ్గర నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుంది. 1983, 1985 ఎన్నికల్లో ఏలూరులో టిడిపి గెలిచింది..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1989లో కాంగ్రెస్, 1994, 1999లో టిడిపి, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2019 ఎన్నికల్లో వైసీపీ..ఇలా ఏలూరు లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
ఇంత సెంటిమెంట్ ఉన్న ఏలూరు సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా టిడిపిలో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. ఈ సీటు టిడిపికే దక్కుతుందా? పొత్తు ఉంటే జనసేనకు దక్కుతుందా? అనేది క్లారిటీ రావడం లేదు. దాదాపు టిడిపి, జనసేన పొత్తు ఖాయమే. పొత్తులో జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాలి. ఆ సీట్లలో ఏలూరు ఉంటుందని అంటున్నారు. పైగా పవన్ ఏలూరు నుంచే రెండో విడత వారాహి యాత్ర మొదలుపెడుతున్నారు.
ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని కీలక స్థానాల్లో పవన్ యాత్ర సాగింది. అప్పుడు పవన్ యాత్ర చేసిన స్థానాలు జనసేనకు పట్టున్న స్థానాలు. టిడిపి పొత్తులో భాగంగా ఆ సీట్లు జనసేనకే దక్కుతాయనే ప్రచారం వచ్చింది. ఇప్పుడు ఏలూరులో యాత్ర మొదలుపెడుతున్నారు. దీంతో ఏలూరు సీటు జనసేనకే దక్కుతుందని అంటున్నారు.
గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే టిడిపి ఓడింది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి 72 వేల ఓట్లు, టిడిపికి 68 వేల ఓట్లు రాగా, జనసేనకు 16 వేల ఓట్లు వచ్చాయి. వచ్చిన ఓట్లు తక్కువే. కానీ గెలుపుని ప్రభావితం చేసింది. దీంతో ఈ సీటు జనసేనకే అంటున్నారు. మరి చంద్రబాబు ప్లాన్ ఎలా ఉంది..ఈ సీటు జనసేనకు వదులుతారో లేదో చూడాలి.