ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఇంకా 10 నెలల వరకు సమయం ఉంది. కానీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేక ఈ లోపే ఎన్నికలు జరుగుతాయా? అనేది క్లారిటీ రావడం లేదు కానీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో పక్కన పెడితే…ఈలోపే గెలుపోటములపై చర్చ జరిగిపోతుంది. వైసీపీ మద్ధతుదారులు ఏమో..మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది..జగనే అధికారంలోకి వస్తారని అంటున్నారు. ఇటు టిడిపి వాళ్ళు ఏమో ఈ సారి ఖచ్చితంగా టిడిపిదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు కూడా తాము అధికారంలో ఉంటామని చెబుతున్నారు.
ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. అదే సమయంలో ఇప్పటినుంచే బెట్టింగ్ లు కూడా సాగుతున్నాయని తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ-టిడిపి శ్రేణుల మధ్య కొన్ని కీలక స్థానాలపై బెట్టింగ్ నడుస్తుందట. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపుపై టిడిపి, వైసీపీ నేతలు బహిరంగంగా సవాల్ విసురుకోవడం చర్చనీయాంశమైంది.
మళ్ళీ అక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మళ్ళీ గెలుస్తారని ఓ వైసీపీ నేత కోటి రూపాయలు పందెం కట్టగా, బాలనాగిరెడ్డి ఓడిపోతాడని, టిడిపి నేత తిక్కారెడ్డి గెలుస్తారని ఓ టిడిపి నేత అంతే పందెం కట్టారు. ఇద్దరు డిపాజిట్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ముందే గెలుపోటములపై పందెం నడుస్తుంది.
అయితే మంత్రాలయంలో ప్రస్తుత పరిస్తితి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఈ సారి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తుంది. టిడిపి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. రాష్ట్రంలో టిడిపి బలం ఇంకా పెరిగితే వైసీపీకి చెక్ పడటం ఖాయం.