ఏ నాయకుడైనా.. ప్రజలు వేసిన ఓట్లతోనే ఎదుగుతాడు.. నాయకుడిగా నిలబడతాడు. మరి ఆ ప్రజలకు ఆ నాయకుడు ఏం చేయాలి? కనీసం మౌలిక సౌకర్యాలైనా ఏర్పాటు చేయాలి. వారి సమస్యలు వినాలి. పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అయితే.. ఇతర నాయకుల మాట ఎలా ఉన్నా.. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు, ప్రజలకు మధ్య భారీ గ్యాప్ పెరుగుతోంది. ఎమ్మెల్యే అంటే.. భయం.. ఆయన ఆవేశపరుడు.. కేసులు పెట్టిస్తాడనే వాదన బలంగా వినిపిస్తోంది.
నిజానికి నాయకుడు అంటే.. ప్రజలకు తల్లో నాలుకగా వ్యవహరించాలి. వారి కష్టాల్లో నేనున్నానంటూ ఆదుకునే మనసు ఉండాలి. ఈ విషయంలో బొల్లా పూర్తిగా విఫలమయ్యారని.. స్థానిక ప్రజలు బాహాటంగా నే చెబుతున్నారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే బొల్లా వ్యవహార శైలిని ప్రజలు పూస గుచ్చినట్టు చెప్పారు. “ఆయనకు ఏం చెప్పాలన్నా.. భయమే. ఆయన ఆవేశ పరుడు. టీడీపీ నాయకుడు జీవీ ఆంజనేయులు మాదిరి కాదు“ అని ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ప్రస్తుతం వినుకొండలో ప్రజలు తిరుగుతున్న రహదారులు కానీ.. రైతులకు అందుతున్న సౌకర్యాలు కానీ.. జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏర్పడినవేనని వినుకొండ ప్రజలు చెబుతున్నారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా వచ్చారని, ఈ సందర్భంగా ఆయనకు సమస్యలు చెప్పుకొందామని ప్రయత్నించామని.. వినుకొండ రైతు ఒకరు చెప్పారు. అయితే.. “మీరు నోరెత్తద్దు.. ఎమ్మెల్యే చెప్పిందే వినాలి“ అని ముందుగానే తమకు హుకుం జారీ చేశారని వెల్లడించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా.. కనీసం తమ సమస్యలను కూడా వినలేదని.. కేవలం దణ్నాలు పెట్టుకుంటూ.. నడుస్తూ వెళ్లిపోయారని అన్నారు. అదే టీడీపీ నాయకులు వస్తే.. అధికారంలో ఉన్నా..లేకున్నా తమ సమస్యలు విన్నారని వింటున్నారని చెబుతుండడం గమనార్హం. వినుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా.. టీడీపీ హయాంలో జీవీ ఆంజనేయులు చేయించిందేనని వారు చెబుతుండడం గమనార్హం. జీవీకి-బొల్లాకు ఎంతో తేడా ఉందని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు.