తెలుగుదేశం పార్టీ గతంలో బాగా పట్టు ఉండి మంచి విజయాలు సాధించి…తర్వాత పట్టు కోల్పోయి వరుస ఓటమి పాలవుతున్న స్థానాల్లో సూళ్ళూరుపేట కూడా ఒకటి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ స్థానంలో గతంలో టిడిపి బాగానే గెలిచింది. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో గెలిచింది. అందులో మూడుసార్లు టిడిపి నుంచి పరసా వెంకట రత్నం గెలిచారు.
ఇక 2014 నుంచి అక్కడ వైసీపీ గెలుస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కిలేవేటి సంజీవయ్య గెలిచారు. అయితే 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది..కానీ ఎమ్మెల్యే సూళ్ళూరుపేటలో చేసిన అభివృద్ధి శూన్యం..పైగా ఇక్కడ వైసీపీ అక్రమాలు ఎక్కువయ్యాయని తాజాగా సూళ్ళూరుపేటలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఫైర్ అయ్యారు. 2019లో భారీ మెజారిటీతో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా సంజీవయ్యను గెలిపించారని, కానీ సూళ్ళూరుపేట ఏమైనా మారిందా.. ఒక్క దళితుడికైనా న్యాయం జరిగిందా..అని లోకేశ్ ప్రశ్నించారు.
గంజాయి, గుట్కా, లిక్కర్ దందా, క్రికెట్ బెట్టింగ్కు సూళ్లూరుపేటను అడ్డాగా మార్చేశారని, సంజీవయ్యని నియోజకవర్గంలో ముద్దుగా కమలహాసన్ అని పిలుస్తారట. ఎందుకంటే.. ఊరంతా తిరిగి హామీలిచ్చి, రేపటికి మరిచిపోతాడట..అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. కమలహాసన్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి.. క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాని నడుపుతున్నాడని ఆరోపించారు.
ఈ ఆరోపణలు ఎమ్మెల్యేకు మైనస్ గా మారాయి. ఇదే సమయంలో ఇక్కడ టిడిపిలో కొన్ని ఇబ్బందులు ఉనాయి. నెక్స్ట్ సీటు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. ఎలాగో టిడిపి ఇంచార్జ్ గా పరసా వెంకట రత్నం ఉన్నారు..మళ్ళీ ఆయనకే సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మాజీ ఎంపీ పనబాక లక్ష్మీకి కూడా ఇక్కడ పట్టు ఉంది. దీంతో సీటు విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. కానీ ఏదేమైనా మళ్ళీ సూళ్ళూరుపేటలో టిడిపి జెండా ఎగిరేలా ప్లాన్ చేస్తున్నారు.