ఈ సారి మళ్లీ అధికారం చేపట్టాలని వైసిపి అధినేత జగన్ ప్రణాళికలు,వ్యూహాలు రచిస్తుంటే సొంత పార్టీ నేతలు మాత్రం అధికారం కోసం, పెత్తనం కోసం కొట్టుకుంటున్నారు.ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది వైసీపీలో వర్గ పోరు బయటపడుతుంది.ఇది వైసీపీకి తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నారు.
చిత్తూరు వైసిపికి మంచిపట్టున్న నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డికి మధ్య అధిపత్య పోరు నడుస్తోంది.ఈసారి చిత్తూరు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థులుగా టికెట్ ఆశిస్తున్న వారిలో ఆరణి శ్రీనివాసులుతో పాటు విజయానందరెడ్డి, బుల్లెట్ సురేష్,భూపేష్ కూడా ఉన్నారు. కానీ ఆరణి శ్రీనివాసులు విజయానంద రెడ్డి మధ్య మాత్రమే వర్గపోరు ఎక్కువగా ఉంది.మళ్లీ తనకే టికెట్ అని ఆరణి శ్రీనివాసులు ప్రచారం చేస్తూ ఉండగా,ఈసారి నాకు టికెట్ ఇస్తా అన్నారని విజయానంద రెడ్డి చెబుతున్నారు.ప్రభుత్వ పథకాలతో ఆరణి శ్రీనివాసులు ప్రజలలోకి వెళుతుంటే సామాజిక సేవా కార్యక్రమాలతో విజయానంద రెడ్డి ప్రజలలో మమేకమవుతున్నారు.
వీరిద్దరూ ఈసారి నాకే టికెట్ అంటూ ప్రజలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.ఇది అన్ని నియోజక వర్గాలలో సర్వ సాధారణం.కానీ వీరిద్దరి మధ్య ఆదిపత్య పోరు మాత్రం తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఆరణి శ్రీనివాసులు ప్రతిపాదించే పనులకు విజయానంద రెడ్డి వర్గం అడ్డు చేపట్టంతో వీరి మధ్య గొడవలు మరోసారి బహిర్గతమయ్యాయి. వీరి మధ్య విభేదాలు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయి వరకు పెరిగాయి,అంటే వీరి మధ్య ఎంతటి విభేదాలు ఉన్నాయో స్పష్టమవుతుంది.
చిత్తూరు అభివృద్ధి కోసం 50 లక్షలతో పనులు చేపట్టడంతో వాటి ఆమోదానికి ప్రతిపాదనను కౌన్సిల్ సమావేశంలో తీసుకురాగా విజయానందరెడ్డి వర్గం శ్రీనివాసులు ప్రతిపాదనను వ్యతిరేకించడంతోపాటు,చైర్మన్ ఆముద పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడంతో ఈ వివాదం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుకు చేరింది. చైర్మన్ ఆముద,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడి వీరు చేయాలనుకున్న పనులకు ఆమోదం తెచ్చుకున్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షుడు భరత్ కు ఫోన్ చేసి ఆరణి శ్రీనివాసులు కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వమని చెప్పడం చర్చనీయాంసంగా మారింది.
ఈ వర్గ పోరు ఇలాగే కొనసాగితే చిత్తూరులో వైసిపి గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.