రాష్ట్రంలో గాలి మారుతుంది..కేవలం సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు పంచుతూ..మళ్ళీ అవే డబ్బులని పన్నుల రూపంలో వెనక్కి లాక్కుంటున్న వైసీపీకి చివరి రోజులు మొదలయ్యాయి..ప్రజలు టిడిపి వైపు చూడటం మొదలుపెట్టారని తెలుస్తోంది. అందుకే టిడిపిలో ఇప్పుడు సీట్ల కోసం పోటీ నెలకొంది. ఆఖరికి వైసీపీ కంచుకోటలుగా ఉన్న సీట్లలో కూడా ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇదే క్రమంలో జగన్ సొంత జిల్లా కడపలోని రాయచోటిలో టిడిపి సీటు కోసం పోటీ నెలకొంది. అయితే మొదట నుంచి రాయచోటిలో టిడిపికి పెద్ద పట్టు లేదు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. కేవలం 1999, 2004 ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి జెండా ఎగిరింది. 2009లో కాంగ్రెస్ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిచారు..2012లో వైసీపీలోకి వెళ్ళి ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా శ్రీకాంత్ మళ్ళీ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు.
జగన్ సన్నిహితుడుగా ఉన్న ఈయన ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. అయితే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న..నిధులు తెచ్చుకుని రాయచోటిని అభివృద్ధి చేసింది లేదు. కాకపోతే ఇక్కడ ముస్లిం, రెడ్డి వర్గం హవా ఉండటమే వైసీపీకి ప్లస్. అయితే శ్రీకాంత్కు చెక్ పెట్టాలని టిడిపి చూస్తుంది.
కాకపోతే టిడిపి సీటు కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు తనయుడు ప్రసాద్ బాబు, అటు మరో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి…ఇటు వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా నలుగురు సీటు కోసం పోటీపడుతున్నారు. కానీ చంద్రబాబు ఇంతవరకు సీటు ఫిక్స్ చేయలేదు. అయితే వీరిలో ఒకరికి సీటు ఫిక్స్ చేసిన…మిగిలిన వాళ్ళు సహకరిస్తేనే రాయచోటిలో టిడిపి గెలిచే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మళ్ళీ గెలుపు కష్టమే.