ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే టిడిపి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జిల్లాలో పలు స్థానాలు టిడిపికి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే అక్కడ కొన్ని సీట్లు టిడిపికి అనుకూలంగా ఉండవు. అలాంటి సీట్లలో నరసన్నపేట కూడా ఒకటి. ఇక్కడ మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తుంది. 1983, 1985, 1994 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది. ఇక ధర్మాన ఫ్యామిలీ ఎంట్రీతో సీన్ మారింది.
ధర్మాన ప్రసాదరావు 1989, 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004, 2009, 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ గెలిచారు. 2014లో టిడిపి గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ ధర్మాన హవానే ఉంది. మొదట విడతలో మంత్రిగా చేసిన కృష్ణదాస్ ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్నారు. నియోజకవర్గంపై ఆయనకు పూర్తి గ్రిప్ ఉంది. అటు మంత్రి ధర్మాన ప్రసాదరావుపై వ్యతిరేకత ఉంది..కానీ కృష్ణదాస్ పై తక్కువే.
అయితే ఇక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అనుకున్న విధంగా పనిచేయడం లేదు. మొదట్లో అంత యాక్టివ్ గా పనిచేయలేదు. నిదానంగా పనిచేసుకుంటున్నారు. దీని వల్ల టిడిపి రేసులో వెనుకబడింది. అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ నియోజకవర్గంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నారు. కానీ అనుకున్న మేర ఇక్కడ టిడిపి బలపడలేదు. ఇటీవల ఏ సర్వే చూసిన నర్సన్నపేటలో టిడిపి గెలుపు కష్టమనే చెబుతున్నారు. ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి అలాంటప్పుడు టిడిపి అభ్యర్ధిని మార్చి ముందుకెళుతుందా? లేదా అదే అభ్యర్ధిని పెడుతుందా? అనేది చూడాలి. ఎన్నికల సమయానికైనా ఇక్కడ టిడిపి పికప్ అవుతుందేమో చూడాలి.