రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైసిపి అధినేత జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల్లో గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పోర్టులు, మెడికల్ కాలేజీలు, సచివాలయ వ్యవస్థ ఇలా జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ కు జగన్ అవసరం ఉంది అని ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు.
అయితే జగన్ చెప్పే అభివృద్ధి మొత్తం మాటల్లోనే కానీ..చేతల్లో లేదు. అందుకే వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏముందని ప్రజల నిలదీస్తే తమ దగ్గర సమాధానం లేదని ఎమ్మెల్యేలందరూ ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాలు తప్ప మరో అభివృద్ధి లేదని, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పన్నులు, రోడ్లు ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో ప్రజల ముందుకు వెళ్లాలంటే సాహసమే అవుతుందని ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు.
అధికారంలోకి రాకముందే ఇచ్చిన హామీలే కాదు , అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా జగన్ గాలికి వదిలేశారు అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి చేస్తానన్న అభివృద్ధి చేయలేని జగన్ మనకు అవసరమే అంటూ ప్రతిపక్షం వారు సెటైర్లు వేస్తున్నారు. జగన్ ఏమో ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అని ప్రచారం చేయాలని అంటారు..జనం కూడా ఆంధ్రాకి జగన్ ఎందుకు అని మాట్లాడుకునే పరిస్తితి. ఇంకా నాశనం కావడానికి జగన్ కావాలా? అని సెటైర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రానికి మళ్ళీ జగన్ అవసరం లేదని జనం భావిస్తున్నారు.