తెలుగుదేశం పార్టీ కంచుకోటలని సైతం కూల్చి ఈ సారి 175 స్థానాలని కైవసం చేసుకోవాలని చెప్పి వైసీపీ రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ఎన్నికల్లో టిడిపి గెలిచిన స్థానాలని సైతం వదలకుండా..ఆ స్థానాల్లో టిడిపిని దెబ్బతీసే విధంగా రాజకీయం నడుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కోట కుప్పంపై ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. అలా టిడిపి సిట్టింగ్ సీట్లని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశారు.
కానీ ఎక్కడ కూడా వైసీపీకి పట్టు దొరకడం లేదు. ఇదే క్రమంలో టిడిపి వరుసగా హ్యాట్రిక్ కొడుతున్న విశాఖ ఈస్ట్, మండపేట సీట్లపై కూడా ఎక్కువగానే ఫోకస్ పెట్టారు. అక్కడ ఎమ్మెల్యేలని ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచారు. అక్కడ వైసీపీ పాగా వేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు.
వెలగపూడిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో..రాజకీయంగా ఆయన్ని దెబ్బతీయడానికి చూశారు. కానీ ఎక్కడా కూడా ఆయన బలం తగ్గలేదు. ఇప్పటికీ విశాఖ ఈస్ట్ లో ఆయనదే లీడ్. నాల్గవ సారి కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటు మండపేటలో వరుసగా మూడుసార్లు వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టడానికి టిడిపి నుంచి తోట త్రిమూర్తులుని తీసుకుని మండపేటలో రాజకీయం నడిపిస్తున్నారు.అధికార బలంతో స్థానిక ఎన్నికలు గెలుచుకున్నారు. మండపేట అసెంబ్లీ సీటు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ మండపేటలో వేగుళ్ళకే లీడ్ కనిపిస్తుంది. పైగా జనసేనతో పొత్తు ఉంటే..వేగుళ్ళని ఓడించడం కష్టమే.