గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాస్త పరువు నిలిపిన జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో 12 సీట్లు ఉంటే టిడిపి నాలుగుసీట్లు గెలుచుకుంది. అద్దంకి, పర్చూరు, కొండపి, చీరాల సీట్లు గెలుచుకుంది. కానీ పశ్చిమ ప్రకాశం సైడ్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. మొదట నుంచి ఆ ప్రాంతంలో టిడిపి వెనుకబడే ఉంటుంది.
కానీ ఈ సారి ఎలాగైనా పశ్చిమ ప్రకాశంలో రాణించాలని టిడిపి చూస్తుంది. టిడిపి నేతలు కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే అనుకున్న మేర పట్టు దొరకడం లేదు. పశ్చిమ సైడ్ ఉన్న నియోజకవర్గాలు..మార్కాపురం, కనిగిరి, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం..ఇక మధ్యలో కందుకూరు ఒకటి ఉంది. ఈ ఆరు స్థానాల్లో టిడిపికి అనుకున్న మేర బలం లేదు.
2014 ఎన్నికల్లో టిడిపి కనిగిరి, దర్శి స్థానాల్లో గెలిచింది..కానీ మిగిలిన స్థానాల్లో ఓడింది. అయితే గత ఎన్నికల్లో వీటిల్లో ఒక్క సీటు కూడా టిడిపి గెలవలేదు. కానీ ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నారు. ఆ మధ్యే పశ్చిమ ప్రకాశంలో చంద్రబాబు పర్యటిస్తే ప్రజా స్పందన భారీగా వచ్చింది. అలాగే ఆయా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపితుంది. కానీ అనుకున్న విధంగా టిడిపి బలపడుతున్నట్లు కనిపించడం లేదు. కేవలం రెండు స్థానాల్లోనే టిడిపికి ప్లస్ కనిపితుంది. అది కూడా దర్శి, కనిగిరి ల్లోనే. కనిగిరిలో టిడిపికి కాస్త ప్లస్ ఉంది. దర్శిలో కూడా బాగానే ఉంది..కానీ ఆ సీటు పొత్తుపై ఆధారపడి ఉంది.
ఇటు గిద్దలూరులో ఇంకా పుంజుకోవాలి. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచింది. ఆ మెజారిటీ కరిగించడం ఈజీ కాదు. ఇక కమ్మ వర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నా సరే కందుకూరులో టిడిపికి కలిసిరాదు. యర్రగొండపాలెంలో ఎస్సీ, రెడ్డి వర్గం ఎక్కువ. దీంతో అక్కడ టిడిపికి పట్టు దొరకడం లేదు. ఇటు మార్కాపురం పక్కా వైసీపీ కంచుకోట. దీంతో పశ్చిమ ప్రకాశంపై టిడిపికి పట్టు దొరకడం లేదు.