రాజకీయాల్లో నేతలు అధికారం కోసం పార్టీలు మారిపోతూ ఉంటారు. అలా పార్టీలు మారడం ఒకోసారి కలిసొచ్చిన ఒకోసారి ఇబ్బందిగా మారుతుంది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల పరిస్తితి కూడా అలాగే ఉంది. ఆ నలుగురుకు వైసీపీలో ఆధిపత్య పోరు ఎదురవుతుంది. ఇదే క్రమంలో విశాఖ సౌత్ లో వాసుపల్లి గణేశ్ పరిస్తితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్తితి.
గత రెండు ఎన్నికల్లో వరుసగా టిడిపి నుంచి గెలిచిన వాసుపల్లి..వైసీపీలోకి జంప్ చేశారు. మరి అక్కడ ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయో తెలియదు గాని..రాజకీయంగా మాత్రం ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా సీటు విషయంలో తలనొప్పులు వచ్చాయి.వాసుపల్లికి..అక్కడే ఉన్న వైసీపీ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తో పడటం లేరు. వాసుపల్లి, సీతంరాజు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. నియోజకవర్గంలో వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతుండడంతో వైసీపీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, నేతలు అయోమయంలో పడ్డారు.
ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయి..దీన్ని పరిష్కరించడానికి చూశారు గాని వర్కౌట్ అవ్వడం లేదు. వాసుపల్లికి పోటీగా సీతంరాజు ఉన్నారు. నెక్స్ట్ సీటు తానే దక్కించుకుంటానని అంటున్నారు. అటు వాసుపల్లి సీటు తనకే అంటున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య సీటు రచ్చ జరుగుతుంది. అయితే ఇద్దరిలో ఒకరికి సీటు దక్కడం ఖాయం..కానీ అదే సమయంలో మరొకరు గెలుపుకు సహకరించరు. ఓడించడానికి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల వైసీపీకే రిస్క్ ఎక్కువ.
వాసుపల్లికే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి..కానీ ఆయనకు సీతంరాజుతో రిస్క్.