అసలే ప్రజా వ్యతిరేకత పెరిగి వైసీపీ కష్టాల్లో ఉందని అనుకుంటే…దానికి తగ్గట్టుగా పార్టీలోని నేతలు ఆధిపత్య పోరుకు దిగడం పెద్ద మైనస్ అయిపోతుంది. దీని వల్ల పార్టీకి మరింత నష్టం జరుగుతుంది. ఇప్పటికే చాలా స్థానాల్లో పోరు నడుస్తుంది. సీట్ల కోసం ఫ్యాన్స్ కుమ్ములాటలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో పెద్ద రచ్చ నడుస్తుంది.
జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పరిస్తితి దారుణంగా ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకతని ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు ఈ ఆధిపత్య పోరు దెబ్బతీస్తుంది. మొదట ఎక్కువ రచ్చ నడిచేది గన్నవరంలో అక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి..యార్లగడ్డ వెంకట్రావు-దుట్టా రామచంద్రరావు వర్గాలకు పడటం లేదు. జగన్ సర్ది చెప్పడం వల్ల కాస్త పోరు ఆగినట్లు ఉంది గాని లోలోపల మాత్రం రగులుతూనే ఉంది.
అటు మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరిలకు పొసగడం లేదు. చాలా రోజుల నుంచి రచ్చ ఉంది. ఇటు పెడనలో మంత్రి జోగి రమేష్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వర్గాలకు పడదు. అదే సమయంలో మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి వర్గం మధ్య రచ్చ నడుస్తుంది. కైకలూరు, తిరువూరు ఎమ్మెల్యేలని సొంత పార్టీ వాళ్ళే ఓడిస్తానని అంటున్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లాకు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఇలా ఉమ్మడి కృష్ణా వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో కొనసాగుతుంది. దీని వల్ల వైసీపీకి భారీగానే డ్యామేజ్ జరిగేలా ఉంది.