వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయబోయే మరో అభ్యర్ధి ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు పలువురు నేతలకు సీట్లు కన్ఫామ్ చేశారు. ఇటీవల సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి అని చెప్పి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కదిరి బహిరంగ సభలో..కదిరి టిడిపి అభ్యర్ధిగా కందికుంట వెంకటప్రసాద్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలాపురం ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు..రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పకనే చెప్పేశారు.
మామూలుగా ఇక్కడ సీటు కోసం పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటిల మధ్య పోటీ ఉంది. కొన్ని నెలల క్రితమే చంద్రబాబు ముప్పిడిని పక్కన పెట్టి..యువకుడైన మద్దిపాటిని ఇంచార్జ్ గా పెట్టారు. అయితే మద్దిపాటికి ముప్పిడి సహకరించడం లేదు. సెపరేట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. ఇటు ముప్పిడికి సీనియర్ నేత ముళ్ళపూడి బాపిరాజు మద్ధతు ఇస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి..మద్దిపాటికి యాంటీగా రాజకీయం నడిపిస్తున్నారు. దీంతో ఆ వర్గం నేతలు మద్దిపాటికి సీటు ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు.
కానీ తాజాగా గోపాలాపురం పర్యటనకు వచ్చిన బాబు..దేవరపల్లి సభలో గోపాలాపురంలో మద్దిపాటిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీంతో మద్దిపాటికి సీటు ఫిక్స్ అని తేలిపోయింది. అయితే వ్యతిరేక వర్గం నేతలు ఎంతవరకు సహకరిస్తారనేది చూడాలి. కానీ నియోజకవర్గంలో దాదాపు టిడిపి కేడర్ మొత్తం మద్దిపాటి వైపే ఉన్నట్లు తెలుస్తోంది.
అటు వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది..దీంతో అక్కడ ప్రజలు సైతం టిడిపి వైపు చూస్తున్నారు. ఈ అంశాలు మద్దిపాటికి కలిసొస్తున్నాయి. ఇక అక్కడ పసుపు జెండా ఎగరడమే తరువాయి.