ఏదో అనుకుంటే..ఇంకేదో అయిందన్నట్లుగా వైసీపీ పరిస్తితి ఉంది. వైసీపీ గెలుపు కోసం అడ్డమైన వ్యూహాలు వేస్తూ..ప్రత్యర్ధులని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే రాజకీయం నడిపిస్తూ..ప్రజలని మభ్యపెట్టేలా ముందుకెళుతున్న ఐప్యాక్ టీంకు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలతో చిక్కులు వచ్చాయి. అసలు జగన్ సొంత పార్టీ నేతల కంటే ఐప్యాక్ టీంనే ఎక్కువ నమ్ముతున్నారు. వారు చెబితేనే ఏదైనా చేస్తున్నారు. ఆఖరికి రోడ్డు అయిన వేస్తున్నారు.
ఇక ఎమ్మెల్యేల పనితీరుని ఐప్యాక్ టీం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. వారు ఏం చేస్తున్నారో చూసి..ఆ రిపోర్టులని జగన్ కు ఇస్తున్నారు. జగన్ ఏమో ఆ రిపోర్టులని పెట్టుకుని ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెబుతున్నారు. సరే ఇంతవరకు అంతా బాగానే ఉంది..కానీ ఎమ్మెల్యేలకు ఏమైనా చేసే అవకాశం ఉంటే చేస్తారా..అసలు బటన్ నొక్కి మొత్తం జగనే చేస్తుంటే..ఇంకా తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు.
అదే సమయంలో ఐప్యాక్ తో సంబంధం లేకుండా సొంతంగా సర్వేలు కూడా చేసుకుంటున్నారట. ఈ సర్వేల్లో ప్రభుత్వ తీరుపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కేవలం పథకాలు ఇస్తే సరిపోదు అని, అభివృద్ధి కూడా చేయాలని ప్రజలు అడుగుతున్నారట. ఇక ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లినప్పుడు పథకాలు కాదు.. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు, అభివృద్ధిపై జనం నిలదీస్తున్నారు.
అటు ఆస్తి పన్ను పెంపు నుంచి చెత్త పన్ను వరకు.. కరెంటు చార్జీల నుంచి బస్సు చార్జీల వరకు బాదుడు.. పాలధర నుంచి పెట్రోల్ దాకా.. కూరగాయల నుంచి నిత్యావసరాల వరకు ధరలు తీవ్రంగా పెరిగిపోయి ప్రజలపై ఆర్ధిక భారం పడుతుంది. దీంతో ప్రజలు..ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అటు కొత్త కంపెనీలు రావట్లేదు..ఉద్యోగాలు లేవు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు అని..వాటిని సరిచేయకుండా తమ పనితీరు అంటూ ఐప్యాక్ హడావిడి చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు.