రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం. గత 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. గతంలో వైఎస్ కుటుంబం నుంచి రాజశేఖరరెడ్డి, విజయమ్మలు పోటీ చేసినా.. రాని మెజారిటీని జగన్ సొంతం చేసుకున్నారు. అయితే.. టీడీపీకి వైసీపీకి మధ్య నెలకొన్న తీవ్ర రాజకీయ పరమైన కారణాలతో ఈ నియోజకవర్గంపై టీడీపీ ఫోకస్ పెంచింది.
“వైనాట్ పులివెందుల“ నినాదం కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు వినిపించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఆరు మాసాల ముందుగానే.. బీటెక్ రవికి ఇక్కడ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి. దీంతో బీటెక్ రవి కూడా.. పులివెందుల ను చుట్టేశారు. గ్రామ గ్రామాన, మండలాల వారీగా కూడా.. ప్రచారం పెంచేశారు. గతానికి బిన్నంగా పార్టీని పరుగులు పెట్టించారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఎప్పుడో జరిగి ఘర్షణల నేపథ్యంలో ఇటీవల బీటెక్ రవిని పోలీసు లు అరెస్టు చేయడం.. ఆ వెంటనే రిమాండ్కు తరలించడం తెలిసిందే. దీంతో ఇప్పుడు గత వారం రోజులుగా పులివెందులలో టీడీపీ ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వివిధ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులను బయటకు రానివ్వడం లేదని.. వచ్చినా.. కేసులు పెడుతున్నారని.. స్థానిక నాయకులు చెబుతున్నారు.
ఈ విషయాలను ముందు టీడీపీ బలంగానే తీసుకున్నా.. తర్వాత ఎందుకో విస్మరించింది. బీటెక్రవికి ప్రత్యామ్నాయంగా నాయకుడిని ఎంపిక చేసి.. ఆయన చేపట్టిన కార్యక్రమాలను ఆగిపోకుండా.. ముందుకు తీసుకువెళ్లాలనే వ్యూహాన్ని పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. దీనిపైనే స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే.. కానీ, కార్యక్రమాలకు ఆటంకాలు వస్తున్నాయి. దీనిపై అధిష్టానం ఫోకస్ పెంచాలి. రవి బయటకు వచ్చే వరకు కార్యక్రమాలకు ఇబ్బందులు వస్తే.. ఎన్నికల నాటికి పార్టీ మళ్లీ మొదటికి వస్తుంది. అని స్థానిక నాయకులు చెబుతున్నారు. మరి దీనిపై అధిష్టానం దృష్టిసారిస్తుందో లేదో చూడాలి.