గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటలని వైసీపీ చాలావరకు బద్దలు కొట్టిందని చెప్పవచ్చు. అలాంటి వాటిల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి. ఇది మొదట నుంచి టిడిపి కోట. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే 7 సార్లు టిడిపి ఇక్కడ గెలిచింది. మధ్యలో 1999 ఎన్నికల్లో ఓడింది. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది.
కేవలం జగన్ గాలి..స్థానికంగా టిడిపిలో గ్రూపు తగాదాలు ఉండటం వల్ల వైసీపీ నుంచి తానేటి వనిత గెలిచారు. తర్వాత జగన్ కేబినేట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు హోమ్ మంత్రిగా ఉన్నారు. పేరుకు హోమ్ మంత్రి కానీ ఆమె చేతిల్లో అధికారాలు ఉన్నాయా? అంటే ఆ విషయం ప్రజలకే తెలుసు. ఇక ఈమె మంత్రి అనే విషయం రాష్ట్రంలో చాలామందికి తెలియదు.అంటే వనిత పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. అటు సొంత పార్టీ కార్యకర్తలని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ వైసీపీ కార్యకర్త.. సోషల్ మీడియాలో హోంమంత్రి తానేటి వనితపై ఓ పోస్టు పెట్టాడు. కొవ్వూరు వైసీపీకి కంచుకోట.. కార్యకర్తల వేదన అర్ధం చేసుకోండి. కొత్త అభ్యర్థిని ప్రకటించండి. తానేటి వనిత వద్దు.. జగనన్న ముద్దు. కార్యకర్తల రక్తంతాగిన వారు వద్దు.. ఓడిపోయే అభ్యర్థి వద్దు. కొత్త వారే ముద్దు. ఇది కొవ్వూరు పరిస్థితి. సేవ్ కొవ్వూరు అని పెట్టాడు.
దీంతో ఆ కార్యకర్తని వెంటనే అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ ఎంపీ జీవీ హర్షకు మార్, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, చాగల్లు జడ్పీటీసీ భర్త గారపాటి శ్రీనివాస్ సీరియస్ అయ్యి..పోలీసులని నిలదీయడంతో 41 నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. ఇప్పటికే కొవ్వూరులో ఓ బలమైన వర్గం వనితకు దూరమైంది. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు సైతం యాంటీ అయ్యారు. దీంతో కొవ్వూరులో ఈ సారి వనితని సొంత వాళ్ళే ఓడించేలా ఉన్నారు.