ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సారి టిడిపి మొదట గెలిచే సీటు ఏదంటే..అంతా కదిరి సీటు అనే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిన కొన్ని రోజులకే టిడిపి అనూహ్యంగా పుంజుకున్న సీట్లలో కదిరి మొదటిది. నిజానికి కదిరిలో అనుకున్న మేర బలం లేదు. అలాగే ఇక్కడ గొప్ప విజయాలు ఏమి సాధించలేదు. 1983లో ఒకసారి గెలవగా, 1994లో మళ్ళీ గెలిచింది. 1999లో టిడిపి పొత్తులో బిజేపి గెలిచింది. మళ్ళీ 2009లో ఇక్కడ టిడిపి గెలిచింది.
అయితే 2014లో గెలుపు దగ్గర వరకు వచ్చి టిడిపి ఓడిపోయింది. కేవలమ వెయ్యి ఓట్ల లోపు మెజారిటీతో టిడిపి నుంచి కందికుంట వెంకటప్రసాద్ ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన అత్తర్ చాంద్ బాషా..నెక్స్ట్ టిడిపిలోకి వచ్చారు. దీంతో కందికుంట, బాషా వర్గాల మధ్య పొసగ లేదు. ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబు..కందికుంటకే సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్, టిడిపిలో పూర్తి సహకారం లేకపోవడంతో ఓటమి పాలయ్యారు.
ఓడిన తర్వాత కూడా కందికుంట వెనక్కి తగ్గలేదు..దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అటు వైసీపీ నుంచి గెలిచిన సిద్ధారెడ్డిపై రోజురోజుకూ నెగిటివ్ పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గంలో పలు అక్రమాలు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి చేయకపోవడం..ఈ అంశాలు వైసీపీకి మైనస్. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేకు యాంటీగా ఉన్నారు.
దీంతో టిడిపి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో తాజాగా కదిరి పర్యటనకు వచ్చిన బాబు..కదిరి టిడిపి అభ్యర్ధిగా కందికుంటని ప్రకటించారు. దీంతో టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది. ప్రజల్లో ఉండటం, పార్టీ బలంగా ఉండటం, వైసీపీ ఎమ్మెల్యేపై యాంటీ కందికుంటకు కలిసొస్తుంది. ఈ సారి కదిరిలో సిద్ధారెడ్డికి చెక్ పెట్టి కందికుంట పసుపు జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పవచ్చు.