ఇచ్చాపురం-ఉండి నియోజకవర్గాలు…రాష్ట్రంలో ఉండే గాలితో సంబంధం లేకుండా టిడిపి గెలిచే స్థానాలు. ఎన్నికల సమయంలో పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఆ స్థానాల్లో టిడిపి గెలుపు ఖాయం. ఆ రెండు స్థానాలు టిడిపికి కంచుకోటలు. మొదట నుంచి టిడిపికి అండగా ఉంటూ వస్తున్నాయి. 1983 నుంచి చూసుకుని 2019 వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఆ స్థానాల్లో టిడిపి ఓడిపోయింది.
అది కూడా వైఎస్సార్ వేవ్ ఉన్న 2004లోనే ఓటమి పాలైంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా ఈ రెండు చోట్ల టిడిపి గెలిచింది. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు చోట్ల టిడిపికి తిరుగులేదని సర్వేలు చెబుతున్నాయి. ఇచ్చాపురంలో టిడిపి ఎమ్మెల్యే అశోక్ ఉన్నారు. అయితే అక్కడ అశోక్ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఆ మధ్య ఆయన అందుబాటులో ఉండటం లేదని నెగిటివ్ వచ్చింది..కానీ నిదానంగా ప్రజల్లోనే ఉండటంతో బలం పెరిగింది.
అలాగే వైసీపీలో ఉన్న వర్గ పోరు టిడిపికి బాగా కలిసొస్తుంది. ఇక్కడ గ్రూపు రాజకీయాలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రధాన కేంద్రంగా మారారని వైసీపీ వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్సీ రామారావు వర్గానికీ, సాయిరాజ్ వర్గానికి మధ్య పొసగడంలేదు. రామారావు.. ధర్మాన వర్గమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా జరుగుతున్న పోరు వల్ల వైసీపీకి మైనస్ ఉంది. అందుకే మళ్ళీ టిడిపి గెలుపు ఖాయమని అంటున్నారు.
ఇక ఉండి అంటేనే టిడిపి కంచుకోట. ప్రస్తుతం మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదట్లో ఆయనపై కాస్త వ్యతిరేకత వచ్చింది గాని..నిదానంగా అది పోయింది. అయితే ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ట్రై చేస్తున్నారు. 2009, 2014లో ఆయన పోటీ చేసి గెలిచారు. 2019లో చంద్రబాబు ఆదేశాలతో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉండి పైనే ఫోకస్ పెట్టారు. కానీ ఇద్దరిలో ఎవరికి సీటు ఇచ్చిన టిడిపికి తిరుగులేదు. అటు వైసీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువ. దీంతో ఉండి మళ్ళీ టిడిపి వశమే.