తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఆయన పేరు లేకుండా ఎక్కడా రాజకీయం జరిగేలా లేదు. ఇక ఆయన పేరుని యథావిధిగానే కేసిఆర్ అండ్ టీం వాడటం మొదలుపెట్టింది. బాబు పేరుని తీసి రేవంత్ రెడ్డిని దెబ్బతీసి..దాని ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించి మళ్ళీ అధికారంలో రావాలనేది కేసిఆర్ టార్గెట్. మొన్నటివరకు బిజేపిని టార్గెట్ చేశారు గాని..ఆ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది.
ఇప్పుడు కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఎక్కడ కాంగ్రెస్ తో ఇబ్బంది అవుతుందా? అని మళ్ళీ చంద్రబాబు పేరు తీసి దెబ్బకొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆ అంశాన్ని వాడుకుని రాజకీయంగా లబ్ది పొందారు. బాబుని బూచిగా చూపించారు. అదిగో మళ్ళీ ఆంధ్రా పెత్తనం వస్తుందని అన్నారు. మళ్ళీ తెలంగాణ ప్రజలని నమ్మించి కేసిఆర్ లాభం పొందారు. అధికారంలోకి వచ్చారు.
మళ్ళీ ఈ సారి కూడా అదే ప్రయత్నం మొదలుపెట్టారు. గతంలో అంటే బాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు లేదు. ఏపీకే పరిమితమయ్యారు. అక్కడ పార్టీ కోసం కష్టపడుతున్నారు. అయినా తెలంగాణకు బాబు ఏమి అన్యాయం చేయలేదు..అభివృద్ధి చేశారు. కానీ కేసిఆర్ అండ్ కొ మాత్రం బాబుని బూచిగా చూపిస్తున్నారు. ఇటీవల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో కేటిఆర్..రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ..అప్పుడు బాబు వ్యవసాయం దండగ అని అన్నారని, ఇప్పుడు ఛోటా చంద్రబాబు అయిన రేవంత్ వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలని అంటున్నారని, కేసిఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని అన్నారు.
అయితే కేసిఆర్ ప్రభుత్వం 12 గంటల కూడా కరెంట్ ఇవ్వడం లేదని, అసలు కేసిఆర్ ఎక్కడ నుంచి వచ్చారు..బాబు దగ్గర చెప్పులు మోశారని అన్నారు. అలా అలా మాటల యుద్ధం సాగుతుంది. మధ్యలో బషీర్ బాగ్ కాల్పుల గురించి తీశారు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ ఉందని, ఇది తెలుగు కాంగ్రెస్ అంటూ కేటిఆర్ విమర్శలు చేస్తున్నారు. దీనికి రేవంత్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు కేసిఆర్ టిడిపి నుంచే వచ్చారని, బిఆర్ఎస్ లో సగం మంది టిడిపి వాళ్ళే అంటున్నారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం..రేవంత్కు మద్ధతు ఇస్తూ..కేటిఆర్ పై ఫైర్ అవుతూ.. ‘‘నీ పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? నీ దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా? నీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా? గంగుల కమలాకర్ ది ముందు టీడీపీ కాదా? బాబూ కేసీఆర్ అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రేవంత్ రెడ్డి గురించి తెలుసుకుని మాట్లాడండి. చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష. నీ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టింది.” అని అన్నారు.
ఇక టిడిపి శ్రేణులు సైతం కేటిఆర్ పై ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ అంటూ విమర్శిస్తున్న సిన్న దొరా.. “రేవంత్ రెడ్డి 2007లో తెలుగుదేశంలో చేరి, 2017లో టీడీపీకి దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాడు హామీ ఇచ్చిన ఉచిత విధానం అమలు కరెక్ట్ కాదని చంద్రబాబు చెప్పింది 2002-03 ప్రాంతంలో.. అప్పటికి అసలు రేవంత్ రెడ్డి ఎవరో ఎవరికీ తెలియదు. అయన అప్పటికి ప్రత్యక్షంగా ఏ పార్టీలో లేరు. మరి ఈరోజు మీ పార్టీ అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ స్కీం గురించి మీ ప్రత్యర్థి అయినా రేవంత్ రెడ్డి మాట్లాడితే.. దానికి చంద్రబాబు గారు ఎలా కారణమవుతారో.. కాస్త వివరణ ఇవ్వగలరా?” అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
సరే.. అదే కరెక్ట్ అనుకుందాం. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి.. తన రాజకీయ ఆలోచనలకు తెలుగుదేశం పార్టీ దగ్గరగా ఉంటుందని, చంద్రబాబుని కలిసి 2007లో టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి తరవాత … ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి, 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి 2021లో పిసిసి అధ్యక్షుడు అయ్యిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు అయితే, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్ అయితే.. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1985-99 మధ్య 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా చేసి తెరాస పెట్టుకున్న పెద్ద దొరవారు, చంద్రబాబు శిష్యులు కారా? అయన నడుపుతున్న భారాస… “చంద్రబాబు భారాస” కాదా? ఈ రోజు తెరాస ప్రధాన నాయకులు అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగితే అందులో 80% తెదేపా వారే కదా చిన్న దొరా?” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మొత్తానికైతే బిఆర్ఎస్ పార్టీలో సగం పైనే టిడిపి నేతలు ఉన్నారు. ఉదాహరణకు మంత్రివర్గం చూసుకుంటే..సిఎం కేసిఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..వీరంతా టిడిపి నుంచి వచ్చినవారే..ఇంకా ఎమ్మెల్యేలు సగం మంది టిడిపి నుంచి వచ్చినవారే. కాబట్టి ఇకనైనా చంద్రబాబు పేరు మానేసి..సొంతంగా చేసింది చెప్పి రాజకీయం చేస్తే కేసిఆర్ అండ్ కొ టీంకి బెటర్.