రాజకీయాల్లో పదవులు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలి..అలా కాకుండా ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం, ప్రజలని గాలికొదిలేయడం చేస్తే అలాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇప్పుడు అధికారంలో వైసీపీ మంత్రుల పరిస్తితి కూడా అదే అయ్యేలా ఉంది. కేవలం జగన్కు భజన, చంద్రబాబుని తిడితే మంత్రి పదవులు అన్నట్లు పరిస్తితి ఉంది. అలాంటి వారికే మంత్రి పదవులు దక్కాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబుకు మంత్రి పదవి వచ్చింది.
పైగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఏ శాఖలో పని ఉన్నా లేకపోయినా..ఈయనకు ఎప్పుడు పని ఉంటుంది. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులే రాష్ట్రానికి జీవనాడులు. అలాంటి ప్రాజెక్టులపై శ్రద్ధ పెడితే రైతులు సిరులు పండిస్తారు. త్రాగునీరు, సాగునీరు, కరెంట్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అంబటి అవన్నీ వదిలేసి..కేవలం బాబు, పవన్లని తిట్టడం, జగన్కు భజన చేసే పనిలోనే ఉన్నారు. ఓ వైపు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులని సందర్శిస్తూ..వైసీపీ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో చెబుతుంటే..అంబటి మాత్రం బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారు.
పైగా ఈయన ఎమ్మెల్యేగా సత్తెనపల్లికి కూడా చేసేది ఏమి లేదు. దీంతో ఈయనపై వ్యతిరేకత పీక్స్ లో ఉంది. ఎప్పుడో 1989లో రేపల్లె నుంచి గెలిచిన ఈయనకు తర్వాత ప్రజా మద్ధతు లేదు. 30 ఏళ్ల తర్వాత సత్తెనపల్లిలో గెలిచారు. ఇలాంటప్పుడు అయిన ప్రజలకు దగ్గరవ్వాలి. కానీ అంబటి ఇంకా దూరమయ్యారు.
అందుకే ఈయన ఇప్పుడు సత్తెనపల్లి వదిలేసి గిద్దలూరులో పోటీ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. బాబు మాటల్లో వాస్తవం ఉందనే చెప్పాలి. సత్తెనపల్లిలో గెలిచే ఛాన్స్ లేదు. ఇక గిద్దలూరుకు వెళితే..గత ఎన్నికల్లో అక్కడ వైసీపీకి 80 వేల మెజారిటీ వచ్చింది. కాబట్టి ఈ సారి ఎలాగోలా గెలిచేస్తామని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల్లో లేని నేతలకు ఎక్కడ పోటీ చేసిన గెలుపు దక్కడం కష్టమే.