ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పీకర్ సెంటిమెంట్ అనేది ఉంది. అంటే ఒక ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన వారు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవరు. ఈ సెంటిమెంట్ కొందరిని రాజకీయంగా బాగా ఇబ్బంది పెట్టింది. అలాంటి వారిలో ప్రతిభా భారతి, నాదెండ్ల మనోహర్, సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివప్రసాద్ రావు..ఇలా కొందరు నేతలు స్పీకర్లుగా పనిచేసి..నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయంగా ఓటములు ఎదురుకున్నారు.
అయితే రాష్ట్రం విడిపోయాక ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పుడు సీనియర్ నేత కోడెల శివప్రసాద్ని స్పీకర్గా నియమించారు. స్పీకర్గా కోడెల బాగానే పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇలా స్పీకర్ సెంటిమెంట్ ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం వెంటబడుతుంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో గెలిచిన ఈయన..మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో తమ్మినేని స్పీకర్ అయ్యారు. కానీ ఏపీ చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా తమ్మినేని రాజకీయం చేశారు.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ..వైసీపీ నేతగా ముందుకెళ్లారు. ప్రతిపక్ష టిడిపిపై అసెంబ్లీలోనూ, బయట కూడా విమర్శలు చేశారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని విమర్శలు వచ్చిన ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక ఇలా స్పీకర్గా ఉన్న తమ్మినేనికి ఇప్పుడు రాజకీయంగా తన సొంత స్థానం ఆమదాలవలసలో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికే ఆయనపై వ్యతిరేకత పుష్కలంగా ఉంది.
సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ వైసీపీ నేతల్లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీపీ సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ సెపరేట్ గ్రూపులు పెట్టారు. వీరిద్దరు స్పీకర్ కు వ్యతిరేకంగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో తమ్మినేనికి సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు. మొత్తానికి స్పీకర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి..తమ్మినేనికి చెక్ పడేలా ఉంది.