తెలుగుదేశం పార్టీకి ఎందుకో మొదట నుంచి రిజర్వ్ సీట్లలో పెద్దగా పట్టు ఉండదు. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా కాంగ్రెస్కే మద్ధతు ఇచ్చేవారు. పైగా టిడిపి పలుమార్లు బిజేపితో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనస్ అయ్యి ఉంటుంది. ఇక కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు వైసీపీ వైపుకు ఎస్సీ, ఎస్టీలు వచ్చారు. అందుకే గత ఎన్నికల్లో 29 ఎస్సీ సీట్లలో వైసీపీ 27, 7 కి 7 ఎస్టీ సీట్లు వైసీపీ గెలుచుకుంది.
ఇప్పటికీ ఆ సీట్లలో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే కొన్ని సీట్లలో సీన్ మారుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రిజర్వ్ సీట్లలో టిడిపి బలపడుతుంది. తూర్పులో 3 ఎస్సీ, 1 ఎస్టీ సీటు ఉంది. రాజోలు, అమలాపురం, పి.గన్నవరం ఎస్సీ సీట్లు, రంపచోడవరం ఎస్టీ సీటు. అయితే రంపచోడవరంలో వైసీపీకే ఆధిక్యం ఉంది. ఇక ఎస్సీ సీట్లలో వైసీపీ బలం తగ్గిపోతుంది.
గత ఎన్నికల్లో రాజోలులో జనసేన, అమలాపురం, పి.గన్నవరం సీట్లలో వైసీపీ గెలిచింది. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్ కొట్టారు. దీంతో మూడు సీట్లు వైసీపీ చేతుల్లో ఉన్నాయి. అయితే మూడు సీట్లలో వైసీపీకి వ్యతిరేకత ఉంది. ఇటు టిడిపి బలపడుతుంది. కానీ ఇక్కడ టిడిపికి ఒక ఇబ్బంది ఉంది. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపి ఓడిపోయింది. ఈ సారి కూడా అదే సమయం ఉంది.
కాకపోతే టిడిపి-జనసేన కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉంది. దీంతో రాజోలు, అమలాపురం, పి.గన్నవరం సీట్లని దక్కించుకోవచ్చు. పొత్తులో రాజోలు జనసేనకు, పి.గన్నవరం టిడిపికి దక్కుతాయి.కానీ అమలాపురం సీటు తేలడంలేదు. ఇక్కడ టిడిపికి, జనసేనకు బలం ఉంది. ఇక ఎవరికి దక్కిన వైసీపీ గెలవదు. మొత్తానికి జనసేనతో పొత్తుతో ఈ ఎస్సీ సీట్లలో టిడిపి సత్తా చాటే ఛాన్స్ ఉంది.