టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి అధినేత చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో గాని అధికారం దక్కకపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు ఉంటాయి. దీంతో అధికారమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. ఎక్కడకక్కడ నేతలని యాక్టివ్ చేసి..పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అటు నారా లోకేష్ పాదయాత్ర టిడిపికి ప్లస్ అవుతుంది. ఇదే సమయంలో ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బాబు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోకు మంచి స్పందన వచ్చింది. కానీ అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో రాష్ట్రంలో 5 జోన్లలో టిడిపి నేతలు బస్సు యాత్ర చేపట్టారు. మేనిఫెస్టోలోని అంశాలని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక మేనిఫెస్టోలోని హామీలని సూపర్ సిక్స్ గా అభివర్ణిస్తూ..ఈ హామీలతో ఐదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల లబ్ది జరుగుతుందని చెప్పుకొచ్చారు.
మొదట 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1500, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, జిల్లాల్లో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు ఏడాదికి రూ.20 వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు..ఈ హామీలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బస్సు యాత్ర ప్లాన్ చేశారు.
అయితే ఈ హామీలు ప్రజల్లోకి వెళితే పార్టీకి బాగా ప్లస్ అవుతుంది. ప్రజలని హామీలు ఆకట్టుకుంటాయనే చెప్పాలి. ఇక దసరాకు పూర్తి మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. అది మరింత ప్రజలని ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. ఈ మేనిఫెస్టో టిడిపిని అధికారంలోకి తీసుకొస్తుందని భావిస్తున్నారు.