రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతున్న స్థానాల్లో కళ్యాణదుర్గం ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్కు పాజిటివ్ లేదు. మంత్రిగా ఉంటూ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా పెద్దగా కృషి చేస్తున్నట్లు లేరు. పథకాలు మాత్రమే ప్లస్. కానీ వైసీపీలో అంతర్గత పోరు ఉంది. ఆమెకు సీటు ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ వాళ్లే అంటున్నారు.
మరి ఇలా ఉంటే టిడిపి కళ్ళు మూసుకుని గెలిచేస్తుందని అనుకోవచ్చు. కానీ అదే పొరపాటు. వైసీపీకి యాంటీ ఉన్న టిడిపికి అనుకున్న మేర పాజిటివ్ లేదు. దీనికి కారణం అంతర్గత పోరు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరీ, ఇంచార్జ్ ఉమా మహేశ్వర నాయుడు మధ్య పోరు ఉంది. ఇద్దరూ ఒకే వర్గం నేతలు. కానీ సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే కళ్యాణదుర్గం టిడిపి కంచుకోట. ఇక్కడ టిడిపి అయిదుసార్లు గెలిచింది.
2014లో చౌదరీ గెలిచారు. కానీ ఆయన పనితీరు బాగోక 2019లో చంద్రబాబు..ఉమామహేశ్వర నాయుడుకు సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో ఓడిపోయారు. ఓడిన తర్వాత ఇంచార్జ్ గా నాయుడు దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. కానీ చౌదరీ వర్గం మద్ధతు ఇవ్వడం లేదు. ఏదో రకంగా దెబ్బతీయాలని చూస్తున్నారు.
ఎప్పటికప్పుడు పోరు నడుస్తుంది. పలుమార్లు బాబు వీరికి క్లాస్ ఇచ్చారు. కలిసి పనిచేయాలని సూచించారు. అయినా ఆగడం లేదు. ఇప్పటికీ అదే తంతు. అందుకే ఇక్కడ టిడిపికి ప్లస్ కనిపించడంలేదు. అయితే టిడిపి నేతలు కలిసి పనిచేస్తే విజయం సులువే. మరి బాబు ఇక్కడ రచ్చకు బ్రేక్ వేసి..కళ్యాణదుర్గం మళ్ళీ టిడిపి వశం అయ్యేలా చేస్తారేమో చూడాలి.